ఆమనగల్లు, జనవరి 30: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందజేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల మండల కేంద్రంలో మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మండల పరిధిలోని 90 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం పాత బ్రాహ్మణపల్లి గ్రామంలో వైకుంఠధామం, కొత్త బ్రాహ్మణపల్లిలో గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అదేవిధంగా అర్కపల్లి గ్రామంలోని బిక్కన్సాబ్ దర్గాలో ప్రార్థనలు చేశారు. నల్లవారిపల్లి గ్రామానికి చెందిన తానయ్యగౌడ్ చనిపోయిన విషయం తెలుసుకొని మృతుడి స్వగృహానికి వెళ్లి తానయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 5వేలు అందజేశాడు. ఆయన వెంట ఎంపీపీ పద్మారెడ్డి, జడ్పీటీసీ ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కిషన్రెడ్డి, సర్పంచ్లు యాచారం వెంకటేశ్వర్లు, ఏర్పుల జంగయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.