షాబాద్, డిసెంబర్ 4: అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగిరింది. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య హ్యాట్రిక్ సాధించారు. ఈ నెల 3వ తేదీన రాజేంద్రనగర్ డివిజన్లోని హిమాయత్సాగర్ లాడ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో చేవెళ్ల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికల్లో మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్యకు 76,218 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పామెన భీంభరత్కు 75,950 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కె.ఎస్ రత్నంకు 38,455 ఓట్లు వచ్చాయి.
బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉండి విజయం సాధించగా, రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ నిలిచింది. కాంగ్రెస్ అభ్యర్థిపై 268 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య విజయం సాధించారు. నోటాకు 1424 ఓట్లు వచ్చాయి. గతంలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చేవెళ్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన కాలె యాదయ్య, కొద్ది రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదే విధంగా 2018 ఎన్నికల్లో 33,552 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి కె.ఎస్ రత్నంపై విజయం సాధించారు. 2014/2018/2023 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు.
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద కాలె యాదయ్య విజయం సాధించిన విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ యువనేత కార్తీక్రెడ్డి తదితరులు ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు వచ్చి ఎమ్మెల్యే యాదయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాలె యాదయ్య మీడియాతో మాట్లాడుతూ…తనకు మూడోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు.