ఆమనగల్లు, జూన్ 6 : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీపై చట్ట పరంగా చర్యలు తీసుకొని వెంటనే ఉరి తీయాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మహిళ సంఘం నాయకురాళ్లతో కలిసి జడ్పీటీసీ అనురాధ నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఢిల్లీ నడి బొడ్డున జంతర్ మంతర్ వద్ద అంతర్జాతీయ క్రీడా వేదికలైన ఒలంపిక్స్ కామన్వెల్త్ , ఏషియన్ గేమ్స్ తదితర పోటీల్లో గోల్డ్, సిల్వర్, బ్రౌంజ్ పతకాలు సాధించి దేశ గౌరవాన్ని నిలబెట్టి దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన మహిళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ లైంగిక వేధింపులకు పాటు పడటం సిగ్గు చేటన్నారు.
ఈ సంఘటన చూసి యావత్తు మహిళ లోకం స్పందించి ఉద్యమిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కండ్ల్లు తెరిచి ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మహిళలపై ఇలాంటి ఘటనలు జరగకుండా నిర్భయ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంలో చట్టాలు చేయాల్సిన పార్లమెంట్ సభ్యులే వాటిని తుంగలో తొక్కడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లైంగిక వేధింపుల నుంచి కాపాడాల్సిన అధ్యక్షుడే తమపై లైంగిక వేధింపులు సాగిస్తున్నాడని 2016 నుంచి మహిళా మల్లయోధులు చెబుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గంథ్రాలయ సంస్థ జిల్లా డైరెక్టర్ రాధమ్మ, ఎంపీటీసీ సరిత, మహిళా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు నిర్మల, ఆదిలక్ష్మి, ఎంపీటీసీ కుమార్, మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ ఖలీల్, వెంకటయ్య, అల్లాజి, కిరణ్, భీమయ్య, రమేశ్ నాయక్, మల్లేశ్ నాయక్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.