కొత్తూరు, మార్చి 29 : అభివృద్ధిలో అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణ వైపు దేశం మొత్తం చూస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కొస్గి భగవద్గీత ఆధ్వర్యంలో బుధవారం కొత్తూరు మండల, మున్సిపాలిటీ బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాన్ని మున్సిపాలిటీ పరిధిలోని రాధా గార్డెన్లో నిర్వహించారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ మాడల్గా దేశం అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం అనే జోడు గుర్రాలపై పరుగెడుతున్నదన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. స్వయంగా కేంద్ర మంత్రులు, కేంద్ర అధికారులు ఈ విషయాన్ని ప్రస్తావించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ‘పల్లె ప్రగతి’ పథకంతో గ్రామాలు అద్భుతంగా మారాయన్నారు. స్వచ్ఛభారత్లో భాగంగా తెలంగాణకు వచ్చిన అవార్డులే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలకు పుట్టినిల్లు తెలంగాణ..
తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా అమలవుతున్నాయా అని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎమ్మెల్యే సవాలు విసిరారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, గొర్రెల పంపిణీ ఇలా చెప్పుకుంటూ పోతే కడుపులో ఉన్న బిడ్డ నుంచి వృద్ధాప్య పింఛన్ వరకు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం లబ్ధి పొందుతున్నదన్నారు.
ఉద్యోగ కల్పనలో మనమే భేష్..
ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి లక్షకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇంకా ఎన్నో కొత్త నోటిఫికేషన్లు ఇస్తున్నామని చెప్పారు. వీటితో పాటు ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. అందుకోసం పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కు మాత్రమే ఉంది..
తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్కు మాత్రమే ఉన్నదని ఎమ్మెల్యే చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశాన్ని, రాష్ర్టాన్ని ఎన్నో ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. అనేక స్కాములతో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. మతాలు, కులాల పేరుతో బీజేపీ దేశాన్ని విడగొడుతున్నదన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్కు మాత్రమే ఉందన్నారు.
‘మిషన్ భగీరథ’తో తీరిన నీటి కష్టాలు..
‘మిషన్ భగీరథ’తో ఇంటింటికీ నీటిని అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రం రాక ముందు నీటి కోసం మహిళలు మైళ్ల దూరం వెళ్లాల్సి వచ్చేదని పేర్కొన్నారు.అనంతరం జడ్పీటీసీ శ్రీలత మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. ఎంపీపీ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలను ఒక పండుగలా నిర్వహిస్తుందన్నారు. ఉద్యమం నుంచి పని చేస్తున్న కార్యకర్తలను గుర్తు చేసుకునేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
మున్సిపల్ చైర్పర్సన్ బాతుల లావణ్య దేవేందర్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ నాయకులు దేవేందర్యాదవ్, ఎమ్మె సత్యనారాయణ, మామిడి శ్యాంసుందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ను ముచ్చటగా మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణయాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వంకాయల నారాయణరెడ్డి, కౌన్సిలర్లు, కొస్గి శ్రీనివాసులు, చంద్రకళ, జయమ్మ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.