రెండో దశ మెట్రో వే అందుబాటులోకి వస్తే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిర్మించనున్న మెట్రో రైలు మార్గం నగరానికి మరో మైలు రాయిగా నిలువనున్నదన్నారు. ఈ పనులకు శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుడుతారని, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రెండో విడుత మెట్రో పనులు మన జిల్లాలో ప్రారంభిస్తున్నందుకు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వికారాబాద్ కొత్తగడిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన 50వ జిల్లా స్థాయి సైన్స్, గణితం, పర్యావరణ ప్రదర్శనను మంత్రి సబితారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
షాబాద్, డిసెంబర్ 7 : హైదరాబాద్ అభివృద్ధి ఫలితం రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల ప్రజలకు కూడా ప్రయోజనాలను చేకూరుస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు తెలిపారు. తాగునీరు, సివరేజ్, డ్రైనేజీ, రవాణా కోసం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తున్నారన్నారు. తెలంగాణ సాధించాక ఎనిమిదేండ్ల కాలంలో ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, లింక్ రోడ్లు నిర్మించారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగిలిన రింగ్రోడ్డు పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్కు మరో మైలురాయిగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్ నుంచి మెట్రో రైలును ఈ నెల 9న ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. ఎయిర్పోర్ట్ ప్రయాణానికి 4గంటల ముందు నుంచి సిద్ధం కావాల్సి ఉండగా.. మెట్రోతో ప్రయాణం ఎంతో సులువవుతుందని పేర్కొన్నారు. దాంతోపాటు ఐటీ ఉద్యోగులు, మన ప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ నెల 9న రెండో విడుత మెట్రో జిల్లాలో ప్రారంభిస్తున్నందుకు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
బీజాపూర్ రహదారి పనులు ప్రారంభం
పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ప్రాజెక్టుతో ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం బీజాపూర్ రహదారి పనులు ప్రారంభమవుతున్నాయని, మూడేండ్లలో రోడ్డు పనులు, మెట్రో పనులు పూర్తయితే ఈ ప్రాంతం మరింతగా కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతుందన్నారు. రింగ్రోడ్డు పక్కనే సైక్లింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు, ఒక ప్రత్యేక విజన్తో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో పార్కులు, నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృష్ణా, గోదావరి జలాలు తీసుకువచ్చి ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.
చారిత్రాత్మక కట్టడాలను రక్షిస్తూ మెట్ల బావిని మనుగడలోకి తీసుకువచ్చిన ఘనత మంత్రి కేటీఆర్కే దక్కుతుందన్నారు. ఈ నెల 9న రంగారెడ్డిజిల్లా పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం మైండ్ స్పెస్ వద్ద ఎయిర్పోర్ట్ మెట్రోకు శంకుస్థాపనతో పాటు రాజేంద్రనగర్ నియోజకవర్గం పోలీసు అకాడమీ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రెండో దశలో 31 కిలోమీటర్ల మేరకు రూ.6250 కోట్లతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు నిర్మించనున్న మెట్రోతో ఎయిర్పోర్ట్ ప్రయాణికులతోపాటు ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కాలుష్య రహిత ప్రయాణంతోపాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయన్నారు.
ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చేలా చర్యలు
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. 9న జరిగే సీఎం సభకు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెట్రో రైలు ఏర్పాటుతో అత్యధికంగా చేవెళ్ల, వికారాబాద్ ప్రాంతానికే లాభం చేకూరుతుందన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు మెట్రో రైలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. రాబోవు రోజుల్లో చేవెళ్ల వరకు కూడా మెట్రో రైలు వచ్చే అవకాశముందని చెప్పారు. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనను విజయవంతం చేయడానికి మంత్రితో కలిసి సమీక్షించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ నర్సింహులు, సర్పంచ్ శివారెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, హన్మంత్రెడ్డి ఉన్నారు.
ప్రతిభను వెలికి తీసేందుకే సైన్స్ఫెయిర్
వికారాబాద్ : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే సైన్స్ఫెయిర్లు ఎంతగానో దోహదం చేస్తాయని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కొత్తగడిలో ఏర్పాటు చేసిన 50వ జిల్లాస్థాయి సైన్స్, గణితం, పర్యావరణ ప్రదర్శనను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థినులు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించి ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. సమస్యతోనే పరిష్కారం పుట్టుకొస్తుందని, కరోనా సమయంలో మందుల సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగేలా, త్వరితగతిన చేరేలా డ్రోన్ సహాయంతో జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినట్లు తెలిపారు.
వ్యాపారాలు, పారిశ్రామికవేత్తలుగా రాణించడానికి ప్రభుత్వం టీ హబ్ ద్వారా కృషి చేస్తున్నదన్నారు. ఇందులో విద్యార్థుల కోసం స్పేస్ కేటాయిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారని తెలిపారు. పరిశ్రమలు స్థాపించి, తాము ఎదగడమే కాకుండా నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. మంత్రి కేటీఆర్ ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమంతో అనేక నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించేలా విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని.. పెద్దఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై రూ.1.20లక్షలు ఖర్చు చేస్తున్నదన్నారు.
జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతోపాటు ఆట, పోటీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు ఉన్న ఆసక్తిని పసిగట్టి వారిని ఆ రంగాల్లో ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులు పాటల పోటీల్లో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎదిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని వివరించారు. ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలతోపాటు మంచి ఉపాధ్యాయులు, ఆహారం అందిస్తున్నదన్నారు. ఈ సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈసారి 10వ తరగతిలో మంచి ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి జడ్పీ నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు.
పట్టుదల, కృషి ఉంటే.. ఏదైనా సాధించవచ్చు
ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. మంచి అవకాశాలు గొప్పవారికే వస్తాయని అనుకోవద్దని.. కృషి పట్టుదలతో ప్రతిఒక్కరూ గొప్పవారవుతారన్నారు. లోకజ్ఞానం కూడా ప్రతి ఒక్కరికి అవసరమని తెలిపారు. మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పట్టుదల,కృషితో ఏదైనా సాధించవచ్చని, విద్యార్థులు తమ కృషితో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. వికారాబాద్ జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, డీఈవో రేణుకాదేవి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, సైన్స్ ఆఫీసర్ విశ్వేశ్వర్, బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అపర్ణ పాల్గొన్నారు.