HomeRangareddyMinister Sabitha Indra Reddy Visit Ponds In Meerpet 2
దశమారిన చెరువులకు దశాబ్ది కళ
చెరువులు, కుంటలు, కట్టల వద్ద ‘చెరువుల పండుగ’తో పునర్ వైభవం సంతరించుకున్నది. ‘చెరువుల పునరుద్ధరణ’ జరగడం ప్రజా సంక్షేమానికి నిదర్శనం. తెలంగాణ అవతరణకు పదేండ్ల పండుగగా తెలంగాణ ప్రభుత్వం ‘దశాబ్ది ఉత్సవాలు’ జరుపుకొంటున్న తరుణంలో భాగంగా గురువారం ‘చెరువుల పండుగ’ను రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జరుపుకొన్నారు.
అంబరాన్నంటిన చెరువుల సంబురం
మీర్పేట చందనం చెరువు వద్ద పాల్గొన్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
‘పహిల్వాన్ చెరువు’ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్, జిల్లా కలెక్టర్ హరీశ్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి
ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు
దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించిన ‘చెరువుల సంబురం’ అంబరాన్నంటింది. కట్ట మైసమ్మకు బోనాలు, బతుకమ్మఊరేగింపులు, పోతరాజుల విన్యాసాలతో ఊరూరా పండుగ వాతావరణం కనిపించింది. మీర్పేట చందనం చెరువు వద్ద జరిగిన వేడుకల్లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, షాబాద్లో ఎంపీ రంజిత్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్లొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చెరువుల పండుగకు హాజరయ్యారు. వికారాబాద్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కలెక్టర్ నారాయణరెడ్డి డప్పుల దరువేసి ప్రజలను ఉత్సాహపరిచారు.
-రంగారెడ్డి, జూన్ 8(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జూన్ 8 (నమస్తే తెలంగాణ): చెరువులు, కుంటలు, కట్టల వద్ద ‘చెరువుల పండుగ’తో పునర్ వైభవం సంతరించుకున్నది. ‘చెరువుల పునరుద్ధరణ’ జరగడం ప్రజా సంక్షేమానికి నిదర్శనం. తెలంగాణ అవతరణకు పదేండ్ల పండుగగా తెలంగాణ ప్రభుత్వం ‘దశాబ్ది ఉత్సవాలు’ జరుపుకొంటున్న తరుణంలో భాగంగా గురువారం ‘చెరువుల పండుగ’ను రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జరుపుకొన్నారు. ప్రతి ఊరిలోని చెరువుల పరిసరాలు గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులతో సందడిగా మారాయి. డప్పుల దరువులు, బోనాలు, బతుకమ్మలతో మహిళలు నృత్యాలు చేసుకుంటూ చెరువు కట్టలు, పరిసరాల్లో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. కట్ట మైసమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ తల్లులకు పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. జిల్లాలో 558 గ్రామాలకు 27 మండలాలు, 5 డివిజన్లు ఉన్నాయి. ఈ ఐదు డివిజన్ల పరిధిలో చెరువుల పండుగను 220 చెరువుల వద్ద నిర్వహించారు. మృగశిర కార్తె కూడా కావడంతో చెరువుల పండుగకు మరొక వేడుక తోడైంది. పలుచోట్ల స్థానికులు, గ్రామస్తులు చెరువులకు చీరె సారె పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
వేడుకల్లో ప్రముఖులు..
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మీర్పేట చందనం చెరువు వద్ద జరిగిన వేడుకల్లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. షాబాద్ పహిల్వాన్ చెరువు కట్టపై గ్రామస్తులు పండుగను అద్భుతంగా నిర్వహించారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్, జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నందిగామ మండల కేంద్రం, అప్పారెడ్డి గూడలోని అంబాపురం చెరువు వద్ద జరిగిన పండుగలో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మహిళలతో పాటు బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటం వేశారు.
షాద్నగర్, బొబ్బిలి చెరువు వద్ద, ఎలికట్ట లాడెన్ చెరువు వద్ద, నర్సప్పగూడ, చిలకమర్రి, కొత్తూరు మండలం గూడూరు, చేవెళ్ల పట్టణం, కేశంపేట పరిధిలోని నిర్దవెల్లి చెరువు వద్ద, శంకర్పల్లి మండలంలో దొంతన్పల్లి చెరువు, మంచాల మండలం అస్మత్పూర్లో, ఆరుట్లలో, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి బ్రాహ్మణపల్లిలో, అయినా చెరువు వద్ద, మాడ్గులలో, తల కొండపల్లిలో, మొయినాబాద్ చిలుకూరులో, ఇంకా పెద్ద చెరువు వద్ద, చేవెళ్ల మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి పుష్కరిణి వద్ద, ఇబ్రహీంపట్నం మండలం చర్ల పటేల్గూడ చెరువు, కొత్తూరు మున్సిపాలిటీలోని సాయిరెడ్డి చెరువు, ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగర కలాన్ దాత చెరువుల వద్ద పండుగలు అద్భుతంగా చేశారు. ఆమనగల్లు పట్టణంలోని సుర సముద్రం చెరువు వద్ద జరిగిన పండుగలో స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. పలు చోట్ల స్థానిక మహిళలు బతుకమ్మలు ఆడి పాటలు పాడారు. ఊరంతా భోజనాలు చేశారు.
ఊరూరా చెరువుల పండుగలో..
జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల ప్రజలు 220 చెరువుల వద్ద ప్రజలు పండుగ జరుపుకొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో – 58 చెరువుల వద్ద, బాలాపూర్ పరిధిలో – 10, మహేశ్వరం పరిధిలో – 22, కందుకూరు – 26, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో – 26, – ఇబ్రహీంపట్నం -6, అబ్దుల్లాపూర్మెట్ – 5, యాచారం – 5, మంచాలలో – 9, హయత్నగర్ – 1గా ఉన్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో – 30 చెరువులు – శంషాబాద్ – 26, గండిపేట – 3, రాజేంద్రనగర్ – 1, షాద్నగర్ నియోజకవర్గంలో – 54, ఫరూఖ్నగర్ – 24, కొత్తూరు – 5, నందిగామ – 3, కేశంపేట – 14, కొందుర్గ్ – 5, చౌదర్గూడెం – 3, చేవెళ్ల నియోజకవర్గంలో – 7, శంకర్పల్లి – 2, మొయినాబాద్ – 2, షాబాద్ – 2, చేవెళ్ల – 1, కల్వకుర్తి నియోజకవర్గంలో – 44, ఆమనగల్లు – 12, కడ్తాల్ – 14, తలకొండపల్లి – 8, మాడ్గుల – 10, కాగా, శేరి లింగంపల్లి నియోజకవర్గంలో- 1 చెరువు వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి.
వికారాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహించిన చెరువుల పండుగ ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొని సంబురాలు చేసుకొన్నారు. ఈ సందర్భంగా మహిళలు నిర్వహించిన బోనాలు, బతుకమ్మ, తదితర సాంస్కృతి కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.
చెరువుల పండుగలో కలెక్టర్, అదనపు కలెక్టర్
రంగారెడ్డి, జూన్ 8(నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా శంషాబాద్ మండలం నరుకుడు గ్రామంలోని మల్లెవాని కుంట చెరువు వద్ద, తొండుపల్లి చెరువు వద్ద నిర్వహించిన ‘ఊరూర చెరువుల పండుగ’ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, శాసన సభ్యులు ప్రకాశ్ గౌడ్, ఆర్డీవో చంద్రకళ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.