మహేశ్వరం, సెప్టెంబర్ 30 : అన్ని కులాలకు ఆత్మ గౌరవ భవనాలను నిర్మిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరంలో రూ.69 లక్షలతో మార్కెట్ షెడ్డు , రూ.4.20 కోట్లతో గిరిజన వసతి గృహం, రూ.5 కోట్లతో సంక్షేమ బాలుర పాఠశాలకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం సేవాలాల్ దేవాలయం, కుల సంఘాల ఆత్మ గౌరవ భవనాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలో అభివృద్ధిలో దూసుకుపోతున్నన్నారు.
మహేశ్వరం నియోజకవర్గానికి మంత్రి సత్యవతి రాథోడ్ విద్యాలయాలకు రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో నియోజకవర్గంలో 24 కులాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. రూ.15 కోట్లతో ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. అర్హులైన పేదలకు 75 గజాల స్థలాలను కేటాయించనున్నట్లు తెలిపారు. మన్సాన్పల్లిలో 5 ఎకరాల్లో పేదలకు ఇండ్ల పట్టాలను అందజేస్తున్నామని ఆమె వెల్లడించారు. ఇంటి జాగ ఉన్నవారికి గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలను అందజేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని తెలిపారు. సీఎం కేసీఆర్ను ఆశీర్వదించి తనను నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించాలని ఆమె కోరారు. అనంతరం ఉప్పుగడ్డతండా, కొత్తతండా, గంగారంతండా, దిలావర్గూడ, ఎన్డీతండాలకు చెందిన పేదలకు ఇండ్ల పట్టాలను మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి సబితారెడ్డి పంపిణీ చేసారు.
ఎరుకల సంక్షేమం కోసం రూ.62 కోట్లతో ఎంపవర్మెంట్ పథకం
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 48 కుల సంఘాలకు ఆత్మ గౌరవ భవనాలను నిర్మిస్తే దానిని ఆదర్శంగా తీసుకొని 24 కుల సంఘాలను నిర్మిస్తున్న ఘనత మంత్రి సబితారెడ్డికే దక్కుతుందని సత్యవతి రాథోడ్ తెలిపారు. ఒకే రోజు 9 కుల సంఘాల ఆత్మ గౌరవ భవనాలకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఏనాడూ గిరిజనులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెయ్యికి పైగా గురుకులాల్లో 7 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. నగరం నడిబొడ్డున రూ.5 కోట్లతో ఎరుకల భవనాన్ని నిర్మించబోతున్నామని చెప్పారు. ఎరుకల సంక్షేమం కోసం రూ.62 కోట్లతో ఎంపవర్మెంట్ పథకం ప్రవేశపెట్టినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఆరు గ్యారెంటీలకు వారెంటీ లేదు
కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలకు వారెంటీ లేదని ఎంపీ రంజిత్రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం మన రాష్ట్ర పథకాలను కాపీ కొడుతున్నదన్నారు. రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీదే అని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని కులాలకు సముచిత స్థానం లభిస్తున్నదన్నారు. నియోజకవర్గానికి ఎనలేని సేవలందిస్తున్న మంత్రి సబితారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు కార్తీక్రెడ్డి, ఎంపీపీ సునీతానాయక్, సహకార బ్యాంక్ చైర్మన్ పాండుయాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్రెడ్డి, వైస్ చైర్మన్ ఆనందం, తహసీల్దార్ మహమూద్అలీ, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు మల్లేశ్యాదవ్ పాల్గొన్నారు.