‘డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలి.. విద్యార్థులు, యువత మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మీర్పేట మున్సిపల్ పరిధిలోని ఎస్వైఆర్ కన్వెన్షన్లో మాదక ద్రవ్యాల నిరోధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా, మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రతి కళాశాలలో ఒకరిని నియమించుకుని మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థినులకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే షీ టీమ్ను సంప్రదిస్తే పరిష్కరించి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.
బడంగ్పేట, జనవరి 11 : డ్రగ్స్కు అలవాటుపడి విద్యార్థులు, యువత జీవితాలను చిత్తు చేసుకోవద్దని మంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధ్వర్యంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్వైఆర్ కన్వెన్షన్లో మాదక ద్రవ్యాల నిరోధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సబితారెడ్డి రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, షీ టీమ్ డీసీపీ షేక్ సలీమా తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. డ్రగ్స్పై అవగాహనకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఒకప్పుడు కాలేజీలో ర్యాగింగ్ ఉండేదన్నారు. కంట్రోల్ చేశామన్నారు.
ప్రస్తుతం డ్రగ్స్ను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కాలేజీలో కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఒకరిని నియమించుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల ప్రలోభానికి గురై బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని విద్యార్థులు, యువతకు సూచించారు. డ్రగ్స్ ప్రమాదకర వ్యసనమన్నారు. చెడు మార్గంలో నడిపిస్తుందన్నారు. డ్రగ్స్కు అలవాటుపడి విద్యార్థులు చదువు మానేసి సర్వస్వం కోల్పోతారన్నారు. బంగారు తెలంగాణ రూపుదిద్దుకుంటున్న తరుణంలో డ్రగ్స్ మహమ్మారిని పారదోలేందుకు విద్యార్థులు, యువత ముందుకు రావాలన్నారు. డ్రగ్స్ తీసుకోబోమని ప్రతిన బూనాలన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా షీ టీమ్ను సంప్రదిస్తే.. సమస్య నుంచి బయటపడవచ్చని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ విజన్ ఉన్న గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్
రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ విజన్ ఉన్న గొప్ప వ్యక్తి అని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, అభివృద్ధి దిశగా అన్ని రకాలుగా కృషి చేస్తున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాల సమస్య అతి పెద్ద సమస్యగా పరిణమించిందన్నారు. ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత డ్రగ్స్కు బానిసలై యవ్వనంలోనే మానసికంగా నిర్వీర్యమవుతున్నారన్నారు. కాలేజీ విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని మాఫియాలు మత్తులో ముంచుతున్నారన్నారు. హెరాయిన్, కొకైన్, ఓపియం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు కాలేజీ విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. మత్తుకు అలవాటైతే మళ్లీ వదిలిపెట్టలేని పరిస్థితి వస్తుందన్నారు. మత్తులో తూలుతున్న యువతను ఆ మత్తు నుంచి బయటకు తీసుకురావాలన్నారు. డ్రగ్స్ విషయంలో యువత అవగాహన కలిగి ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల గురించి ఎటువంటి సమాచారమున్నా పోలీసులకు తెలియజేస్తే.. వారి పేర్లను రహస్యంగా ఉంచుతామన్నారు. అమ్మాయిల వేధింపులకు గురైతే షీ టీమ్తో కలిసి చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు.
మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దు
ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ.. విద్యార్థి దశలో కొంతమంది సరదాగా చెడు స్నేహాల కారణంగా మత్తుకు అలవాటుపడుతారన్నారు. క్రమేపి వాటికి బానిసలై తమ జీవితాలనే నాశనం చేసుకోవడమే కాకుండా తమ కుటుంబాలను నష్టం చేసేలా మారుతారన్నారు. విచక్షణ కోల్పోయి ఏమి చేస్తున్నామో కూడా తెలియని విధంగా ప్రవర్తిస్తారన్నారు. మత్తుకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని డీసీపీ సూచించారు.
కార్యక్రమంలో డ్రగ్స్ అవగాహన మోటివేషన్ స్పీకర్లు నైనా జైస్వాల్, వంశీ కృష్ణారెడ్డి, కృష్ణ చైతన్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిఫ్యూటీ మేయర్ విక్రంరెడ్డి, కార్పొరేటర్లు రామచంద్రం, పద్మ, జంగారెడ్డి, మీర్పేట, బాలాపూర్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్లు మహేందర్రెడ్డి, భాస్కర్, కిరణ్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.