రంగారెడ్డి, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఆహుతులకు ఆహ్వాన పత్రికలు అందించి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పాల్గొంటున్న కార్యక్రమానికి రావాల్సిందిగా కొత్తూరు మున్సిపాలిటీ పాలకవర్గం ఆహ్వానిస్తున్నది. బొకేలతోపాటు ఆహ్వాన పత్రికలు అందించి ఆత్మీయతను చాటుకుంటున్నది. ఈనెల 5న మంత్రి కేటీఆర్ షాద్నగర్ నియోజకవర్గ పర్యటనకు వస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తూరు మున్సిపాలిటీలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన 60 డబుల్ బెడ్రూం ఇండ్లకు, రూ.3.5 కోట్లతో నిర్మించిన కొత్తూరు మున్సిపాలిటీ నూతన భవనానికి మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు.
అలాగే నందిగామ మండలంలోని చాకలిగుట్టతండాలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ప్రారంభించనున్నారు. షాద్నగర్లోనూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొని బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అధికారులు మంత్రి పర్యటనకు సంబంధించి ఘన ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభ నిర్వహణ ప్రాంతం, హెలిప్యాడ్ ప్రాంతాల్లో ఏర్పాట్లను ఎప్పటికప్పు డు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తోపాటు నాయకులు పర్యవేక్షిస్తున్నారు.
కొత్తూరు మున్సిపాలిటీ పాలకవర్గం, అధికార యంత్రాంగం ఆహ్వాన పత్రికను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ మేరకు మంత్రులు సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, పట్నం మహేందర్రెడ్డిలతోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, ఇతర ముఖ్యులను నేరుగా కలిసి ఆహ్వాన పత్రిక, పూల బొకేలు అందించి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. నేటి ఆధునిక వ్యవస్థలో పిలుపులన్నీ ఆన్లైన్లోనే సాగుతున్నాయి. ఏ శుభకార్యం, ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా ఆహ్వానించడం పరిపాటిగా మారింది. అయితే కొత్తూరు మున్సిపాలిటీ పాలకవర్గం మాత్రం సంప్రదాయాన్ని పూర్తిగా పక్కకు పెట్టకుండా కొన్ని ఆహ్వాన పత్రికలను ముద్రించి ముఖ్యులందరికీ స్వయంగా అందజేయడం ద్వారా ప్రత్యేకతను చాటుకుంటున్నది.