ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని కొంగరకలాన్లో ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటుకు కంపెనీ చైర్మన్ యంగ్లీ, మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కిషన్రెడ్డిలతో కలిసి నేడు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఇందుకు ఉ.10:30కి ముహూర్తం ఖరారు చేశారు. రూ.1656 కోట్ల పెట్టుబడితో 196 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ కంపెనీతో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనున్నది. నేడు జరిగే కార్యక్రమానికి కంపెనీ బృందంతో పాటు టీఎస్ఐఐసీ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. అనంతరం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 10 వేల మందితో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభా ఏర్పాట్లను ఎమ్మెల్యే కిషన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్కుమార్రెడ్డి (బంటి) ఆదివారం పరిశీలించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
– రంగారెడ్డి, మే 14 (నమస్తే తెలంగాణ)/ఆదిబట్ల, మే 14
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/ఆదిబట్ల, మే 14 : ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ గ్రామంలో తైవాన్ కేంద్రంగా పనిచేసే ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటుకు సోమవారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేయనున్నారు. కొంగరకలాన్లో 196 ఎకరాల భూమిలో రూ 3.500 కోట్ల పెట్టుబడితో ఫాక్స్కాన్ ఏర్పాటు కానుంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు కంపెనీ చైర్మన్ యంగ్లీ, మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి భూమి పూజ నిర్వహించనున్నారు. రెండు రోజులుగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్ఐఐసీ) అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.
పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
భూమి పూజ చేయడానికి ఫాక్స్కాన్ బృందం, టీఎస్ఐఐసీ అధికారులు దగ్గర ఉండి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఎమ్మెల్యే మంచిరెడ్డి, బీఆర్ఎస్ యువజన రాష్ట్ర నాయకుడు ప్రశాంత్కుమార్రెడ్డి (బంటి) ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే భూమి పూజ చేసే ప్రాంతమంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
10 వేల మందితో బహిరంగ సభ
ఫాక్స్కాన్ కంపెనీ భూమి పూజ అనంతరం బీఆర్ఎస్ అధ్వర్యంలో పెద్దఎత్తున బహిరంగ సభను నిర్వహించనున్నారు. బహిరంగ సభకు ప్రజలను తరలించడానికి రెండు రోజులుగా ప్రణాళికను రూపొందించారు. నియోజకవర్గం నుంచి దాదాపు 10 వేల మంది రానున్నారు.