కొంగరకలాన్ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15వ తేదీన ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేయనున్నారు. రూ.1656 కోట్లతో 196ఎకరాల్లో ఈ కంపెనీని ఏర్పాటు చేయనుండగా.. 2024 మార్చి నెలలోపు ఇక్కడి నుంచి ఎగుమతులు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. మంత్రి కేటీఆర్ రాకను పురస్కరించుకొని అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డి కంపెనీ ప్రతినిధులతో కలిసి సదరు స్థలాన్ని పరిశీలించారు. కాగా, ఈ కంపెనీ అందుబాటులోకి వస్తే 35వేలకు పైగా మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
-ఇబ్రహీంపట్నం/ ఆదిబట్ల, మే 10
ఇబ్రహీంపట్నం/ఆదిబట్ల, మే 10 : రంగారెడ్డిజిల్లా కొంగరకలాన్ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఫాక్స్కాన్ కంపెనీ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. కంపెనీ ప్రతినిధులు కోరిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కంపెనీ కోసం కొంగరకలాన్ సమీపంలో కలెక్టరేట్ ఎదుట 196 ఎకరాలను కేటాయించింది. ఇప్పటికే కంపెనీ ముఖ్యులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడే కంపెనీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు తెలియజేశారు. దీంతో ఔటర్ రింగ్రోడ్డు పక్కనే కలెక్టర్ కార్యాలయం ఎదుట స్థలాన్ని కేటాయించారు. ఈ నెల 15న ఫాక్స్కాన్ కంపెనీకి చెందిన ప్రముఖులతో కలిసి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.
రోడ్లు, ఇతరత్రా భవనాలకు సంబంధించిన మ్యాప్ పరిశీలన
బుధవారం కంపెనీ ప్రతినిధులతో కలిసి టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎండీ, ఎమ్మెల్యే, కంపెనీ ప్రతినిధులు కలెక్టర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. శంకుస్థాపనకు సంబంధించి కార్యక్రమాలతోపాటు అందులో ఏర్పాటు చేయనున్నరోడ్లు, ఇతరత్రా భవనాలకు సంబంధించిన మ్యాపును పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్న వెంటనే రంగారెడ్డి జిల్లాలో ఫాక్స్కాన్ కంపెనీ పెద్దఎత్తున సెల్ఫోన్లను తయారుచేయడానికి ముందుకొచ్చింది. పరిశ్రమల ఏర్పాటే లక్ష్యంగా, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి విదేశాల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు.
196 ఎకరాల్లో రూ.1656 కోట్ల పెట్టుబడితో..
ఫాక్స్కాన్ కంపెనీ 196 ఎకరాల్లో రూ.1656 కోట్ల పెట్టుబడితో పెద్దఎత్తున ఉత్పత్తులను ప్రారంభించనుంది. దీంతో సుమారు 35 వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. పరోక్షంగా, ప్రత్యక్షంగా మరికొంతమంది స్థానికులకు కూడా ఇందులో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఫార్మాసిటీ, ఫ్యాబ్సిటీ, ఏరోస్పేస్, టీసీఎస్ వంటి అనేక దిగ్గజ కంపెనీలు ఈ ప్రాంతంలో ఏర్పాటవుతున్నాయి. కొత్తగా ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో మరింతమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు.
పనుల పరిశీలన
ఈ నెల 15న మంత్రి కేటీఆర్ ఫాక్స్కాన్ కంపెనీకి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితోపాటు ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులు పనులను పరిశీలించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలు జేసీబీలు, హిటాచీలతో కంపెనీ ఏర్పాటుకు సంబంధించిన భూమిని చదును చేస్తున్నారు. భవనాల నిర్మాణాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రోడ్లు, ఇతరత్రా సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఏర్పాట్లపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్కుమార్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్ పాల్గొన్నారు.