ప్రతిష్టాత్మక పథకానికి రంగారెడ్డి జిల్లా నుంచే శ్రీకారం ‘సీఎం అల్పాహారం’ పథకాన్ని ‘రావిర్యాల’ పాఠశాలలో ప్రారంభించిన మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి జిల్లాలో 1,310 ప్రభుత్వ పాఠశాలలు 1,43,500 మంది విద్యార్థులకు లబ్ధి
రంగారెడ్డి, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): ‘సీఎం కేసీఆర్ చేపడుతున్న అనేక కార్యక్రమాలకు రంగారెడ్డి జిల్లా వేదికగా నిలుస్తోంది. గత జూన్ నెలలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో హరితోత్సవ వేడుకలను సీఎం కేసీఆర్ జిల్లాలోని తుమ్మలూరు నుంచే లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ‘సీఎం అల్పాహారం’ కార్యక్రమానికి మరోసారి రంగారెడ్డి జిల్లా వేదికగా నిలిచింది. శుక్రవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని ‘రావిర్యాల’ ఉన్నత పాఠశాలలో ‘అల్పాహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలుత ప్రతి నియోజకవర్గంలో ఒక పాఠశాలలో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. దసరా నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈ కార్యక్రమం అమలు కానుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారిలో పేద కుటుంబాలకు చెందిన వారే ఉంటున్నారు. తల్లిదండ్రులు కూలీ పనులు, ఇతర పనులకు వెళ్లే సందర్భంలో ఉదయం వేళల్లో విద్యార్థులు ఖాళీ కడుపులతోనే పాఠశాలలకు వస్తున్నారు. ఉదయం వేళల్లో రాగి జావ, మధ్యాహ్న వేళ సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నప్పటికీ, ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మానవీయతతో విద్యార్థుల పస్తులకు చెల్లు పలికేలా ‘సీఎం అల్పాహార పథకం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అమలులోకి తెచ్చారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ ఈ పథకం కింద నిత్యం అల్పాహారాన్ని అందిస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం: ఇడ్లీ, సాంబారు లేదా గోధుమ రవ్వ, ఉప్మా, చట్నీ
మంగళవారం: పూరీ, ఆలూకుర్మా లేదా రవ్వతో టమాటా బాత్, సాంబారు
బుధవారం: ఉప్మా, సాంబారు లేదా బియ్యం రవ్వ కిచిడీ, చట్నీ
గురువారం: చిరుధాన్యల ఇడ్లీ, సాంబారు లేదా పొంగల్, సాంబారు
శుక్రవారం: ఉగ్గాని/అటుకులు/చిరుధాన్యల ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ
శనివారం: పొంగల్, సాంబారు లేదా వెజిటబుల్ పులావ్, రైతా/ ఆలూకుర్మా