రంగారెడ్డి, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా సందర్శనకు వచ్చిన జల్శక్తి అభియాన్ కేంద్ర నోడల్ బృందం సభ్యులు అంకిత్ మిశ్రా(డిప్యూటీ సెక్రటరీ), అంకిత్ విశ్వకర్మ(సైంటిస్ట్)లకు మంగళవారం అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆహ్వానం పలికారు. అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో జల్శక్తి అభియాన్ కేంద్ర నోడల్ బృందం సభ్యులు సమావేశమయ్యారు. జల్శక్తి అభియాన్ ద్వారా జిల్లాలో చేపట్టిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్ వారికి వివరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో జల్శక్తి అభియాన్ ద్వారా నీటిని నిల్వ ఉంచే ప్రయత్నంలో ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, బోరు బావులు, చెరువులు, చెక్ డ్యామ్ల నిర్మాణాలను చేపట్టి నీటిని ఒడిసిపట్టడం ద్వారా జిల్లాలో వరి పంటలు, పండ్లు, పువ్వులు సాగు చేసుకుంటున్న విధానాన్ని బృందానికి వివరించారు. జిల్లాలో తాగునీరు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.
జిల్లాలోని 558 గ్రామపంచాయతీల్లో హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడంతోపాటు, నాటిన మొక్కలను సంరక్షిస్తూ పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామ నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి పచ్చదనం పెంపొందించడం జరుగుతున్నదని వివరించారు. సమావేశంలో జడ్పీ సీఈవో దిలీప్కుమార్, డీఆర్డీవో ప్రభాకర్, అడిషనల్ పీడీ నీరజ, వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి, అటవీశాఖ అధికారి సుధాకర్రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారి బన్సీలాల్, మిషన్ భగీరథ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.