యాచారం, నవంబర్ 11 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలంలోని మేడిపల్లి అభివృద్ధి, పచ్చదనం, శుభ్రతలో ప్రగతి పథంలో కొనసాగుతున్నది. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్యార్డు, వైకుంఠధామం, రైతువేదిక భవనం తదితర అభివృద్ధిలో గ్రామం ముందుకు సాగుతున్నది. పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్దడం, ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, మిషన్ భగీరథ నల్లా సౌకర్యం, ఇప్పటికే ప్రతి గల్లీలో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మించగా, పెండింగ్లో ఉన్న మరిన్ని పనుల నిర్మాణం చేపడుతున్నారు.
నర్సరీలో మొక్కలను పెంచుతూ, హరితహారం కార్యక్రమంలో గ్రామంలో నాటిన మొక్కలను సంరక్షిస్తూ పచ్చదనం పెంపొందిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. సర్పంచ్ చిగురింత శ్రీనివాస్రెడ్డి పంచాయతీ పాలకమండలితో పాటు గ్రామ ప్రజలతో కలిసి పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ గ్రామ రూపురేఖలను మార్చేస్తున్నారు.
ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ
గ్రామంలో మిషన్ భగీరథ తాగునీరును అందించడం కోసం 725నల్లాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో మొత్తం 2పాత ట్యాంకులు, కొత్త ట్యాంకుతో మొత్తం మూడు ట్యాంకులున్నాయి. మంచినీరును నిల్వ చేసే 3సంపులున్నాయి.
పచ్చదనాన్ని పెంపొందించే పల్లె ప్రకృతివనం
పల్లె ప్రకృతి వనంలో 1610 మొక్కలను పెంచుతున్నారు. ఇందులో వివిధ రకాల పండ్లు, పూలు, డిజైన్ మొక్కలున్నాయి. మొక్కలకు పాదులు తీసి, కలుపు మొక్కలను తొలగించి, నిత్యం పంచాయతీ ట్యాంకర్తో నీరుపోసి సంరక్షిస్తున్నారు. పల్లె ప్రకృతి వనం చుట్టూ కంచెతో పాటుగా పెద్ద ముఖద్వారాన్ని నిర్మించి గేటు ఏర్పాటు చేశారు. మొక్కలను వృక్షాలుగా మలచడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది కృషి చేస్తున్నారు.
రూ.12.50 లక్షలతో వైకుంఠధామం
వైకుంఠధామాన్ని రూ.12.50లక్షల ఉపాధిహామీ పథకం నిధులతో నిర్మించారు. వైకుంఠధామంలో రెండు శ్మశాన వాటికలు, స్నానాల గదులు, బాత్రూంలు నిర్మించారు. గ్రామంలో ఎవరూ మృతి చెందినా ఒకే చోట దహన సంస్కారం చేసేందుకు ఏర్పాటు చేశారు.
నర్సరీలో మొక్కల పెంపకం
నర్సరీలో మొక్కల పెంపకం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నది. హరితహారం కింద నర్సరీ మొక్కలను నాటారు. మొక్కలకు నీళ్లుపెట్టి, ట్రీగార్డులను ఏర్పాటు చేసి పరిరక్షిస్తున్నారు.
లైటింగ్.. జిగేల్
గ్రామంలో ప్రతి వీధిలో విద్యుత్ దీపాలు అమర్చడంతో రాత్రిపూట విద్యుత్ వెలుగులతో జిగేల్ మంటున్నాయి. గ్రామంలో ఒకప్పుడూ అంధకారంలో ఉన్న కాలనీలు ప్రస్తుతం ప్రతి వార్డులో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. గ్రామంలో అన్ని వీధుల్లో వీధి దీపాలను అమర్చారు. దీంతో గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ను నిర్మించడంతో లోఓల్టేజీ సమస్య పూర్తిగా తొలిగిపోయింది.
టీఎస్ఐఐసీ సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణం
గ్రామంలోని భూములు ఫార్మాసిటీ ఏర్పాటుకు గ్రామస్తులు కోల్పోవడంతో టీఎస్ఐఐసీ గ్రామాభివృద్ధికి చేయూతనిచ్చింది. గ్రామంలో రూ.కోటితో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మొత్తం 2.5కిలో మీటర్లు సీసీ రోడ్లు వేసేందుకు నిధులు కేటాయించింది. ఇప్పటికే కొన్ని వార్డుల్లో సీసీ రోడ్లు నిర్మించగా, మరికొన్ని వార్డుల్లో నిర్మాణంలో ఉన్నాయి. దీంతో దాదాపుగా గ్రామంలోని అన్నివార్డులు సీసీ మయంగా మారనున్నాయి. నూతనంగా 5కిలో మీటర్ల సీసీ రోడ్లను వేయనున్నారు.
2.50లక్షలతో కంపోస్టు యార్డు నిర్మాణం
ఉపాధిహామీ పథకం నిధులు రూ.2.50లక్షలతో కంపోస్టు యార్డును నిర్మించారు. కంపోస్టు యార్డులో సేకరించిన చెత్తను వేసి సేంద్రియ ఎరువును తయారుచేసేందుకు కృషి చేస్తున్నారు. పంచాయతీ ట్రాక్టర్ ద్వారా నిత్యం చెత్త సేకరించి కంపోస్టు యార్డుకు తరలిస్తున్నారు.
రూ.22లక్షలతో రైతు వేదిక
గ్రామంలో రూ.22లక్షలతో రైతువేదిక భవనం నూతనంగా నిర్మించారు. నానక్నగర్, మల్కీజ్గూడ, తక్కళ్లపల్లి, మేడిపల్లి, తాటిపర్తి గ్రామాలు ఈ రైతువేదిక క్లస్టర్ కిందకు వస్తాయి. రైతులంతా ఒకే చోట సమావేశం కావడానికి, సభలు జరుపుకోవడానికి, వివిధ రకాల ప్రయోగాలు, పరీక్షలు నిర్వహించడానికి, విత్తనాలు, ఎరువులు నిల్వ చేసుకోవడానికి, రైతులకు పంపిణీ చేయడానికి, వ్యవసాయ క్షేత్ర స్థాయి అధికారుల కార్యక్రమాలు కొనసాగడానికి రైతు వేదికలు ఉపయోగపడుతాయి.
పల్లె ప్రగతితో చేపట్టిన పలు అభివృద్ధి పనులు
పల్లెప్రగతి ద్వారా గ్రామంలో 54 పాడుబడిన పాత ఇండ్లను కూల్చివేశారు. రూ.6.2లక్షలతో పంచాయతీ అవసరాలకు కొత్త ట్రాక్టర్, రూ.1.50లక్షలట్రాలీ, రూ.1.5లక్షలతో ట్యాంకర్ కొనుగోలు చేశారు. గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు, భూగర్భ డ్రైనేజీ, మిషన్భగీరథ నల్లాల బిగింపు పనులు పూర్తి. 12.50లక్షలతో వైకుంఠధామం, 2.50లక్షలతో కంపోస్టుయార్డు నిర్మాణాలు పూర్తి. రూ.22లక్షలతో రైతువేదిక నిర్మాణాన్ని పూర్తి చేశారు.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
గ్రామ ప్రజలు, పంచాయతీ పాలకవర్గం సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. పల్లె ప్రగతితో రెండేండ్లుగా గ్రామం అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది. గ్రామంలో విద్యుత్, విద్యా, వైద్యం, సీసీరోడ్లు, అండర్ డ్రైనేజీ, తాగునీరు తదితర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. పల్లెప్రగతిలో భాగంగా వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, కంపోస్టుయార్డు, డంపింగ్యార్డు, వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులను పూర్తి చేశాం. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మండలంలోనే ఆదర్శంగా నిలపడమే లక్ష్యం. – చిగురింత శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ మేడిపల్లి