ఫిబ్రవరి మాసాంతం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటలయ్యిందంటే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి ప్రతాపానికి బయటకు రావాలంటే ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో సహజసిద్ధంగా లభించే కొన్ని రకాల పానీయాలు, ఆహార పదార్థాలు తీసుకోవడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే కొబ్బరిబొండం, చెరుకురసం, వివిధ రకాల పండ్ల రసాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో ఉపశమనంగా ఉంటుందని చెబుతున్నారు. నీటి శాతం ఎక్కువగా లభించే కీరదోసతో ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నందున ప్రజలు శీతలపానీయాలపై మొగ్గు చూపకుండా చెరుకురసం, నిమ్మరసం, కొబ్బరిబొండంతోపాటు ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వాటిని తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
– ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 10
ఎండాకాలంలో వేసవి తాపం నుంచి తక్షణ ఉపశమనం పొందాలన్న, అలసట నుంచి తక్షణ శక్తిని పొందాలన్న తప్పనిసరిగా కొబ్బరి నీళ్లు తాగాల్సిందే. మనిషి అనారోగ్యానికి గురైతే గ్లూకోజ్ ఎక్కిస్తారు. గ్లూకోజ్లో ఉండే పోషకాల కంటే అధికంగా కొబ్బరిబొండంలో లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. దీంతోపాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణం కొబ్బరి నీళ్లలో ఉంటాయి. కడుపులో అప్పుడప్పుడు వచ్చే మంటలను తగ్గించడానికి టానిక్లా పనిచేస్తుంది. మనిషి శరీరంలో లవణాల శాతాన్ని పెంచడానికి కూడా ఈ నీళ్లు ఎంతో ఉపయోగపడుతాయి.
కొబ్బరినీళ్లను ఎప్పుడైనా ఎవరైనా తాగవచ్చునని డాక్టర్లు సూచిస్తున్నారు. కొబ్బరిబొండంలో సోడియం, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సల్ఫర్, క్లోరైడ్, ప్రొటీన్స్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పాలలోని ప్రొటీన్ల కంటే కొబ్బరి నీళ్లలో ఎక్కువగా ఉంటాయని.. శరీరంలో లవణాల శాతం పడిపోయినప్పుడు ఈ నీళ్లను ఉపయోగించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మూత్రపిండాల సమస్య ఉంటే కొంతమేరకు తగ్గించాలి. మార్కెట్లో దొరికే వివిధ రసాయనాలతో తయారుచేసిన చల్లని పానీయాల కంటే వంద రెట్లు ఆరోగ్యం పంచే కొబ్బరిబొండం మేలని అంటున్నారు.
అనాదిగా వస్తున్న చెరుకు రసాన్ని అన్ని కాలాల్లో తయారుచేసి విక్రయిస్తుంటారు. ప్రధానంగా వేసవిలో దీని విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ప్రస్తుతం పల్లె, పట్టణం తేడా లేకుండా చెరుకు రసాన్ని విక్రయిస్తున్నారు. ధర అందుబాటులో ఉండి, ఆరోగ్యాన్ని ఇచ్చే చెరుకు రసంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని, మండుటెండల నుంచి ఉపశమనం పొందేందుకు చెరుకు రసం ఎంతో ఉపయోగపడుతుందని వైద్యాధికారులు అంటున్నారు.
మనకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ.. అతి తక్కువ ధరకు లభించే వాటిల్లో కీరదోస ఒకటి. ఇది వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై లభించడంతో పాటు కూరగాయల మార్కెట్లో కూడా కీర దోసకాయలు విరివిగా లభిస్తాయి. కీరదోసను భోజనంలో తీసుకోవడం ద్వారా కూడాఎన్నో లాభాలున్నాయని వైద్యాధికారులు తెలియజేస్తున్నారు. కీరదోస ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తుందని.. కీరను తీసుకోవడం ద్వారా కొన్ని వ్యాధులు దరిచేరవని వైద్యాధికారులుంటున్నారు.