రంగారెడ్డి, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) ; వైద్యశాస్త్రం కొత్తపుంతలు తొక్కుతున్నా.. పురుష పుంగవుల్లో అపోహలు, అనుమానాలు తొలగడం లేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు పురుషులు దూరంగా ఉంటున్నారు. కుటుంబ నియంత్రణ అంటే మహిళలకు సంబంధించిన అంశంగా సమాజంలో నాటుకుపోయింది. గర్భస్తం నుంచి బిడ్డ ప్రసవం వరకు ఎంతో వేదనను అనుభవిస్తున్న ‘అమ్మ’.. శస్త్ర చికిత్స సమయంలో మరోమారు కడుపు కోతకు గురవుతున్నది. గడిచిన నాలుగున్నరేండ్లలో రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 89 మాత్రమే వేసెక్టమీ ఆపరేషన్లు జరుగగా.. 58,055 ట్యూబెక్టమీ శస్త్ర చికిత్సలు జరగడం ఇందుకు నిదర్శనం. వేసెక్టమీ ఆపరేషన్లపై చైతన్యపర్చడంలో భాగంగా ఈనెల 24 వరకు జిల్లా వైద్యారోగ్య శాఖ వేసెక్టమీ శస్త్ర చికిత్స పక్షోత్సవాలు ఉండగా, ఈనెల 23 వరకు ప్రత్యేక వేసెక్టమీ క్యాంపులను సైతం నిర్వహిస్తున్నది.
కాబోయే అమ్మకు ఆపద. మాతృమూర్తిగా మారే తరుణంలో అనుకోని ఇబ్బందులు. పురుష పుంగవుల్లో నెలకొన్న అపోహే అమ్మలకు ముప్పు తెస్తున్నది. కనీసం..కట్టుకున్మ భర్త సైతం ‘ఆమె’ భారాన్ని పంచుకోవడంలేదు. అన్నింట్లో ఎంతో ప్రేమను పంచే శ్రీవారు ఆ…ఆ‘పరేష(షా)న్’ అంటేనే అల్లంత దూ రంలో ఉంటున్నాడు. గర్భస్తం నుంచి బిడ్డ ప్రసవం వరకు ఎంతో వేదనను అనుభవిస్తున్న ‘అమ్మ’.. శస్త్ర చికిత్స సమయంలో మరోమారు కడుపు కోతకు గురవుతున్నది. సృష్టికే ఆధారమైన ఆమెకు ఇంట్లో శ్రీవారి నుంచి ఆదరణ లభించకపోవడం ఆవేదనకు గురిచేస్తున్నది. వేసెక్టమీ ఆపరేషన్లతో ఎటువంటి నష్టం ఉండదని వైద్యశాఖ స్పష్టంచేస్తున్నా.. పురుష పుంగవుల్లో మాత్రం మార్పురావడం లేదు. గడిచిన నాలుగున్నరేండ్లలో జిల్లావ్యాప్తంగా 89 మాత్రమే వేసెక్టమీ ఆపరేషన్లు జరుగగా.. 58,055 ట్యూబెక్టమీ శస్త్ర చికిత్సలు జరుగడం ఇందుకు నిదర్శనం. వేసెక్టమీ ఆపరేషన్లపై చైతన్యపర్చడంలో భా గంగా ఈనెల 11 నుంచి 24 వరకు జిల్లా వైద్యారోగ్యశాఖ వేసెక్టమీ శస్త్ర చికిత్స పక్షోత్సవాలను నిర్వహిస్తున్నది. ఈనెల 23 వరకు ప్రత్యేక వేసెక్టమీ క్యాంపులను నిర్వహిస్తున్నది.
వైద్యశాస్త్రం కొత్త పుంతలు తొక్కుతున్నా..ఇంకా అపోహలు.. అనుమానాలే. వేసెక్టమీ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలపై పురుషుల్లో అపోహలు తొలగడంలేదు. వాటిని మహిళలకు సంబంధించినవిగా భావిస్తూ పురుషులు శస్త్ర చికిత్సలకు దూరంగా ఉంటున్నారు. దీంతో మహిళలే ముందుకొచ్చి శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సి వస్తున్న ది. గ్రామీణ ప్రాంతాల్లో వెసెక్టమీ ఆపరేషన్ల ఊసే లేకపోగా.. నగరాల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. దీంతో జిల్లాలోనూ ప్రతియేటా ఒక్క శాతం కూడా పురుషులు ఈ శస్త్ర చికిత్సలు చేయించుకోకపోవడం విస్మయం కలిగిస్తున్నది.
పురుషులకే అధిక ప్రోత్సాహం..
ఒక్కో ట్యూబెక్టమీకి ప్రభుత్వం ప్రోత్సాహకంగా రూ. 880 ఇస్తుంటే.. అదే వేసెక్టమీకి రూ.1,100 వరకు ప్రభు త్వం చెల్లిస్తున్నది. ప్రోత్సహించిన వారికి రూ.200 అందజేస్తున్నది. వేసెక్టమీ శస్త్ర చికిత్సలను ప్రోత్సహించేందుకు ట్యూబెక్టమీ కంటే ఎక్కువ నగదును ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ పురుషుల నుంచి స్పందన కరువవుతున్నది. ఫలితంగా వైద్యశాఖ అనుకున్న లక్ష్యానికి చేరువ కాలేకపోతున్నది. 2019 నుంచి 2023 నవంబర్ వరకు జిల్లావ్యాప్తంగా 58,055 ట్యూబెక్టమీ ఆపరేషన్లు జరిగితే వేసెక్టమీ ఆపరేషన్లు కేవలం 89 మాత్రమే జరిగాయి.
కొనసాగుతున్న వేసెక్టమీ పక్షోత్సవాలు..
కుటుంబ నియంత్రణలో భాగంగా పురుషుల వేసెక్టమీ శస్త్రచికిత్సలను ప్రోత్సహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ రంగారెడ్డి జిల్లాలో ఈనెల 11 నుంచి 24 వరకు పక్షోత్సవాలను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఈనెల 18 నుంచి 23 వరకు ప్రత్యేక వేసెక్టమీ క్యాంపులను ప్రత్యేక నిర్వహిస్తున్నారు. 20న పెద్దాశపూర్ పీహెచ్సీలో, 21న సరూర్నగర్ సీహెచ్ సీలో, 22న షాద్నగర్ సీహెచ్సీలో, 23న కందుకూరు పీహెచ్సీలో క్యాంపులను నిర్వహిస్తున్నారు. 18న ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన క్యాంపునకు ఇద్దరు పురుషులు మాత్రమే వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకునేందుకు వచ్చారు. ఆపరేషన్ థియేటర్లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా వారిని సరూర్నగర్ క్యాంపునకు రావాల్సిందిగా సూచించినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు.
వేసెక్టమీ సులువైన ఆపరేషన్
వేసెక్టమీ ఆపరేషన్ చాలా సులువైనది. నోస్కాల్పెల్ వేసెక్టమీ(ఎన్ఎస్వీ) ఆపరేషన్లో కోత, కుట్లు అనే వి ఉండవు. అయినా పురుషుల నుంచి స్పందన లేదు. సెక్స్ సామర్థ్యం తగ్గుతుందన్న భావన పురుషుల్లో ప్రధానంగా నెలకొనడంతోనే ఈ ఆపరేషన్లు చేసుకునేందుకు వారు ముందుకు రావడంలేదు. ఇది కేవలం అపోహ మాత్రమే. వైద్యశాఖ ఆధ్వర్యంలో వేసెక్టమీ ఆపరేషన్లపై అవగాహన కల్పిస్తూనే ఉ న్నాం. ప్రతిఏటా ప్రత్యేక క్యాంపుల ను నిర్వహిస్తు న్నాం.
– వెంకటేశ్వరరావు, డీఎంహెచ్వో, రంగారెడ్డి జిల్లా
అధునాతన పద్ధతులున్నా..
ప్రస్తుతం కుటుంబ నియంత్రణకు పలు అధునాతన పద్ధ్దతులు అందుబాటులోకి వచ్చాయి. కోత, రక్తస్రావం, కుట్లు లేకుండా శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. పురుషులకు చేసే వాటిని వేసెక్టమీగా వ్యవహరిస్తారు. నోస్కాల్పెల్ వేసెక్టమీ (ఎన్ఎస్వీ) పద్ధతి ద్వారా వీటిని చేస్తారు. శస్త్ర చికిత్స చేసిన 20 నిమిషాల్లోనే నడిచి ఇంటికి వెళ్లిపోవచ్చు. తర్వాత రోజు నుంచే తమ పనులను యథావిధిగా చేసుకోవచ్చు. ఎలాంటి ఇతర ఇబ్బందులు తలెత్తే అవకాశంలేదని వైద్యులు చెబుతున్నారు. మహిళలకు చేసే ట్యుబెక్టమీలో ప్రస్తుతం డబుల్ పంక్చర్ లైప్రోస్కోపీ(డీపీఎల్) అనే అధునాతన పద్ధతిని పాటిస్తున్నారు. దీన్ని కూడా ఎలాంటి కోత, రక్తస్రావం లేకుండానే చేస్తారు. కొద్దిపాటి విశ్రాంతితో యథావిధిగా పనులు చేసుకోవచ్చు. అయితే శారీరక శ్రమ ఎక్కువగా ఉండే మహిళలకు బదులుగా పురుషులు ముందుకొచ్చి వేసెక్టమీ శస్త్ర చికిత్సలు చేయించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వైద్యులు వ్యక్తం చేస్తున్నారు.