రామంతాపూర్, మే 30: కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకెళుతున్నదని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆదివారం రామంతాపూర్ ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో సూపర్ స్ప్రెడర్లకు పంపిణీ చేసే వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ టీకాను వేసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని తెలిపాతు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీకా కేంద్రం ఇన్చార్జి కృష్ణమోహన్, డాక్టర్ మోహన్లాల్, వైద్యశాల సూపర్వైజర్ భోగ ప్రకాశ్, టీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, నందికంటి శివ, సూరం శంకర్ తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్: కరోనా సెకండ్ వేవ్లో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న రేషన్, గ్యాస్ ఏజెన్సీ డీలర్లు, ఆటో డ్రైవ ర్లు, పెట్రోల్ పంపు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ టీకా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం హెచ్బీకాలనీ వార్డు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని పరిశీలించారు.
చర్లపల్లి: ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఏఎస్రావునగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కుషాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిత్య సేవకులకు వ్యాక్సిన్ కూపన్లను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు సోమశేఖర్రెడ్డి, కొత్త అంజిరెడ్డి, ఎస్ఏ రహీం, మధుకర్రెడ్డి, వీరేశ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.