బోడుప్పల్, మార్చి28: రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంతో జరుగుతు న్న 68వ అంతర్జిల్లాల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బోడుప్పల్ వేదికగా మారింది. కీ॥శేషులు చెర్ల ఆంజనేయిలు స్మారకార్థం బోడుప్పల్ వైష్ణవీ అకాడమీలో నిర్వహిస్తున్న ఈ కబడ్డీ పోటీలకు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అనుమతి లభించింది. ఈనెల 30నుంచి జరుగనున్న కబడ్డీ పోటీల చాంపియన్ షిప్ ట్రోఫీని,జెర్సీలను ఆదివారం మంత్రి చామకూర మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్యాదవ్, స్థానిక మేయర్ సామల బుచ్చిరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మంత్రులు కేటీఆర్,హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్తో పాటుగా 11వందల మంది క్రీడాకారులు, వంద మంది పరిశీలకులు, వందలాది మంది కబడ్డీ అభిమానులతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడంతో పాటుగా, క్రీడా మైదానంలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులు, పార్టీ అధ్యక్షుడు సంజీవరెడ్డికి సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, నాయకులు కాటపల్లి రామచంద్రారెడ్డి, బొమ్మక్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.