మేడ్చల్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): సమష్టిగా పని చేసి హరితహారం, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశాపుహాల్లో మంగళవారం ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుంచి 10 వరకు ఏడవ విడత హరితహారం నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని ప్రతి పల్లె, పట్టణంలో పచ్చదనం, పరిశుభ్రత కనిపించాలన్నారు. పది రోజుల్లో రాష్ట్రస్థాయి బృందాలు ఆకస్మికంగా సందర్శించి పనితీరును పరిశీలిస్తాయని తెలిపారు. హరితహారంలో యువతి యువకులు స్వచ్ఛంద సంస్థలు పాల్గొనేలా అధికారులు చూడాలని, జాతీయ రహదారుల సమీపంలో మొక్కలు నాటేందకు గుంతలను సిద్ధంగా ఉంచాలన్నారు. అధికారులు పల్లె నిద్ర చేసి సమస్యలను తెలుసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంసన్, జడ్పీ సీఈవో దేవసహాయం, పద్మజారాణి, వేంకటేశ్వర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.