మేడ్చల్, మే 29(నమస్తే తెలంగాణ): కరోనా విపత్కర పరిస్థితులలో దాతల సహాయం అభినందనీయమని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని ‘ఎపిరోక్ మైనింగ్ ఇండియా సంస్థ’ రూ.52.50 లక్షల విలువైన ఐదు వెంటిలేటర్లను జిల్లా కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ శ్వేతా మహంతికి సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలకు సేవలు అందించేందుకు ఎంతగానో కృషి చేస్తుందని, దీనికి తోడుగా తమ వంతు సహాయంగా ఎపిరోక్ మైనింగ్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఒక్కోటి రూ.10.50 లక్షల విలువైన వెంటిలెటర్లను అందించి ఉదారత చాటుకుందన్నారు. ఈ విషయంలో వారి సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రజల యోగ క్షేమాలను దృష్టిలో పెట్టుకుని వెంటిలేటర్లను అందజేసిన సంస్థ జనరల్ మేనేజర్ సుధాకర్ దేశ్ముఖ్కు కలెక్టర్ శ్వేతా మహంతి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి అందరూ అండగా నిలిచి కరోనాను నియంత్రించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ హెచ్ఎఆర్ మేనేజర్ నాగేంద్ర వంశీ, ప్లాంట్ మేనేజర్లు అశోక్, వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు, డీఆర్వో లింగ్యానాయక్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.