మేడ్చల్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): అడవుల పెంపకంపైనే వాతావరణ సమతౌల్యం, ఆర్థిక వృద్ధి, వర్షాలు, వ్యవసాయం మొదలైన అంశాలన్నీ ఆధారపడి ఉన్నాయి. అందులో భాగంగానే అటవీ పెంపకంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆధునిక రీతిలో అటవీ పెంపకంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతంలో విత్తనాలను వెదజల్లే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా చేపట్టి వివిధ అటవీ ప్రాంతాలను ఎంపిక చేసి డ్రోన్ల ద్వారా విత్తనాలను వెదజల్లుతున్నారు. మేడ్చల్ జిల్లాలో కీసర అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసి అటవీ పెంపునకై డ్రోన్ల ద్వారా విత్తనాలను వెదజల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 8603 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతాలు ఉన్నాయి. మొదట కీసర అటవీ ప్రాంతమైన 1524 ఎకరాలలో మరింత అటవీ పెంపునకు చర్యలు చేపట్టింది.
కీసర అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా 10 వేల సీడ్బాల్స్ (విత్తనాలను) వెదజల్లనున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా కీసర అటవీ ప్రాంతంలో అటవీ పెంపకం కోసం లక్షల్లో మొక్కలు నాటారు. కాగా, మొక్కలు నాటే విలులేని ప్రదేశాలలో డ్రోన్ల ద్వారా సీడ్బాల్స్(విత్తనాలు)ను వెదజల్లుతున్నారు. అటవీ శాఖ అధికారులు నిపుణుల సలహాలను తీసుకుని విత్తనాలను సీడ్బాల్స్లా తయారు చేశారు.
ఇందులో అటవీ జాతికి చెందిన వివిధ సీతాఫల్, చింత, మోదుగు, ఆల్సీ, నీమిలినార, రావి విత్తనాలను వెదజల్లుతున్నారు. అటవీ శాఖ పర్యవేక్షణలో గుబ్బ సంస్థ ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా విత్తనాలు వెదజల్లే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఎత్తైన ప్రాంతాలను డ్రొన్ ద్వారా గుర్తించి విత్తనాలను వెదజల్లుతున్నారు.
కీసరలో డ్ల్రోన ద్వారా సీడ్బాల్స్ను వెదజల్లే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించినా, త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఇటీవల వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో వాతావరణం అనుకూలించకపోవడంతో సీడ్బాల్స్ను వెదజల్లే కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. వర్షాలు లేని సమయంలో సీడ్బాల్స్ను వారం రోజులలో పూర్తి చేయనున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగానే అటవీ ప్రాంత పెంపుపై అటవీ శాఖ అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలలో భాగంగా అటవీ పెంపు క్రమంగా వృద్ధి చెందుతున్నది.