మల్కాజిగిరి, ఏప్రిల్ 12: మనకు కావాల్సినవన్నీ ప్రభుత్వమే చేస్తున్నదని చూడకండి.. సమాజానికి మీరు కొంత సహకారం అందించండి.. అప్పుడే మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించవచ్చని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్పష్టం చేశారు. మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో వ్యాపారులు, ప్రజల సహకారంతో మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 154 కమ్యూనిటీ సీసీ కెమెరాలను సోమవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్లు రిమోట్ కంట్రోల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి లక్ష్మీసాయి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీపీ భగవత్, డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, ఏసీపీ శ్యాంప్రసాద్, మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రావుల సమన్వయం ఎంతో ఉందని, అందుకు మల్కాజిగిరిలో నేరాల సంఖ్య చాలా వరకు తగ్గిందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు పూర్తిగా సహకరించిన వ్యాపారులు, కాలనీ సంఘాలు, ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. ప్రతి చోట పోలీసు ఉండాలంటే మన జనాభాకు పోలీసులు సరిపోరని, మారిన కాలానికి అనుగుణంగా సమాజంలో నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతున్నాయన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానమని ఆయన తెలిపారు. 2008లో మల్కాజిగిరి డీసీపీగా పనిచేశానని గుర్తుచేస్తూ.. ఆ సమయంలో ఒక గంటలో పది చోట్ల చైన్స్నాచింగ్లు అయ్యాయన్నారు. సీసీ కెమెరాల పనితీరును చెబుతూ ఇటీవల ఘట్కేసర్లో ఓ యువతి కిడ్నాప్ సంఘటనను వివరిస్తూ సీసీ కెమెరాల ఆధారంగానే ఆటో డ్రైవర్లు నిర్దోషులుగా గుర్తించగలిగామన్నారు. ఇదే మల్కాజిగిరిలో సైతం ఓ పెయింటర్ రాత్రిపూట కాలనీల్లో పెద్దపెద్ద కార్లను తగులబెట్టేవాడని, ఈ సంఘటనను చేదించింది కూడా సీసీ కెమెరాల వల్లే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. మల్కాజిగిరిలో 154 సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు.