మేడ్చల్ జోన్ బృందం, మే 22: ప్రభుత్వ దవాఖానకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందించి వారిలో భరోసా నింపాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వైద్యులకు సూచించారు. కీసరలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శనివారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగం నయమవుతుందని ప్రభుత్వ దవాఖానకు వస్తున్న నిరుపేద రోగుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా వైద్యులు వారికి అండగా నిలిచి వైద్యం అందించాలన్నారు.ఎక్కడికక్కడా కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని చెప్పారు. లాక్డౌన్తో కరోనా తగ్గుముఖం పడుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సరిత, ఎంపీడీవో పద్మావతి, ఎంపీవో మంగతాయరు, ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, సర్పంచ్లు మాధురీవెంకటేశ్, ధర్మేందర్, పెంటయ్య, విమలానాగరాజు, ఎంపీటీసీలు కవితాశశికాంత్, వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జె.సుధాకర్రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
కీసర మండల పరిధిలోని కీసర, అంకిరెడ్డిపల్లి, భోగా రం తదితర గ్రామాల్లో శనివారం నిర్వహించిన జ్వర సర్వేను ఎంపీడీవో పద్మావతి, ఎంపీపీ ఇందిర, ఎంపీవో మంగతాయారు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు
కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని ఎంపీడీవో అరుణ కోరారు. ఘట్కేసర్ మండల పరిధిలోని కాచవానిసింగారంలో నిర్వహించిన జ్వర సర్వేను ఆమె పరిశీలించారు.కార్యక్రమంలో సర్పం చ్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
మేడ్చల్ మండల పరిధిలోని 17 పంచాయతీలు, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఫీవర్ సర్వే యథావిధిగా కొనసాగింది. గ్రామ పంచాయతీల్లో 14 సర్వే బృందాలు 430 కుటుంబాలను సర్వే చేసి, 18 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించి మెడికల్ కిట్లను అందజేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5సర్వే బృందాలు 210 కుటుంబాలను సర్వే చేయగా నలుగురికి లక్షణాలు ఉన్నట్టు గుర్తించి కిట్లను అందజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 7 ఉపకేంద్రాల్లో 12 మందికి మెడికల్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జైపాల్రెడ్డి,బాలరాజు, హేమంత్రెడ్డి పాల్గొన్నారు.
పోచారం మున్సిపాలిటీలో ముగిసిన రెండో దఫా ఫీవర్ సర్వేపై చైర్మన్ కొండల్రెడ్డి నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేలో మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డుల్లో 4,790 కుటుంబాలను సర్వే చేసి వారిలో 219 మందిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు సర్వే బృందాలు గుర్తించాయని చైర్మన్ వివరించారు. 174 మందికి మెడికల్ కిట్లను అందజేసినట్లు తెలిపారు.
సర్వేఅనంతరం పోచారం మున్సిపాలిటీలోని వార్డుల్లో కరోనా నివారణ చర్యలను ముమ్మరం చేసినట్లు చైర్మన్ కొండల్రెడ్డి తెలిపారు. నివాస ప్రాంతాల్లో హైపోక్లోరైట్ను పిచికారీ చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చైర్మన్ వివరించారు. కార్యక్రమంలో వైద్యాధికారి యాదగిరి, కమిషనర్ సురేశ్, మేనేజర్ నర్సింహులు, కో-ఆప్షన్ సభ్యుడు అక్రం అలీ, ఏఎన్ఎం విమల, సిబ్బంది పాల్గొన్నారు.