మేడ్చల్ రూరల్, జూలై 20 : అభివృద్ధిలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో రూ.కోటితో చేపట్టిన గుండ్లపోచంపల్లి-మైసమ్మగూడ పనులను మంత్రి మంగళవారం ప్రారంభించారు. అలాగే వైకుంఠ రథం, చెత్త సేకరణకు కొనుగోలు చేసిన మూడు ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మైసమ్మగూడ రోడ్డు సమస్య చాలా రోజులుగా ఉందన్నారు. మున్సిపాలిటీ ద్వారా చేపడుతున్న రోడ్డు నిర్మాణంతో సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. పన్నుల రూపంలో ఆదాయం రావడంతో ప్రభుత్వం కూడా మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నదని పేర్కొన్నారు. లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వద్ద కల్యాణ మండపం నిర్మాణానికి రూ.కోటి మంజూరైనట్లు తెలిపారు
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించినట్టు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు, సర్పంచులు, కార్మికులు నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో పలు అభివృద్ధి పనులపై చర్చించి, తీర్మానం చేశారు. కార్యక్రమంలో చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ అమరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, డీఈ చిరంజీవి, కౌన్సిలర్లు బాలరాజ్, జైపాల్ రెడ్డి, శ్రీనివాస్, వీణాసురేందర్గౌడ్, రజితావెంకటేశ్, శ్రీలతాశ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యురాలు జయశ్రీ, మున్సిపాలిటీ అధ్యక్షుడు సంజీవ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
మేడ్చల్ : అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చేస్తున్న కృషితో నేడు పల్లెలు, పట్టణాలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ మున్సిపాలిటీలో పారిశుధ్య పనుల కోసం ఏర్పాటు చేసిన రెండు నూతన ట్రాక్టర్లను మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ప్రారంభించారు. అనంతరం పారిశుధ్య, పారిశుధ్యేతర సిబ్బందికి దుప్పట్లు, ఎల్ఈడీ బల్బులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకంలో భాగంగా మొదటి దశలో నీటి వసతి అందని వారికి , రెండో దశలో నూతనంగా ఏర్పడిన కాలనీలకు తాగునీరు అందించడానికి రూ.1200 కోట్లు మంజూరయ్యాయన్నారు. చెరువుల సుందరీకరణ, మినీ ట్యాంక్ బండ్గా మార్చేందుకు హెచ్ఎండీఏకు నివేదికలు సమర్పించామని చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నర్సింహా రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు దేవరాజ్, గణేశ్, సుహాసిని, శ్రీనివాస్రెడ్డి, మహేశ్, హరికృష్ణ,సాయికుమార్, శివకుమార్, కో ఆప్షన్ సభ్యులు నవీన్రెడ్డి, మహబూబ్ అలీ, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు శేఖర్గౌడ్, నాయకులు నర్సింహా రెడ్డి, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
చైర్పర్సన్ దీపికా నర్సింహారెడ్డి అధ్యక్షతన మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.