మేడ్చల్, ఆగస్టు23(నమస్తే తెలంగాణ): ఏం ఉద్ధరించారని దీక్ష…దీక్ష పేరిట అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నమే…సొంత నియోజవర్గమైన మల్కాజిగిరిలో ఏం ఉద్ధరించావ్… సీఎం దత్తత గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి అడిగితే తెలుస్తుందని.. అభివృద్ధిపై బహిరంగ చర్చకు మేము సిద్ధం.. మీరు సిద్ధమా? అని మూడుచింతలపల్లిలో టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి సవాల్ విసిరారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో మర్రి రాజశేఖర్రెడ్డి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. “టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అసలు దీక్ష ఎందుకు చేస్తున్నారు? దళితులకు దళితబంధు ఇస్తున్నందుకా? రైతుబంధు ఇచ్చి అదుకున్నందుకా..ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ ద్వారా రూ. 20 లక్షలు ఇచ్చి విదేశాల్లో చదివిస్తున్నందుకా” అని ప్రశ్నించారు.
మూడుచింతపల్లి మండలాన్ని సీఎం కేసీఆర్ పాలన సౌలభ్యం కోసం మండలంగా ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. మూడు గ్రామాలకు కలిపి డబుల్బెడ్రూం నిర్మించేందుకు రూ. 5 కోట్ల నిధులు కేటాయించారన్నారు. సీఎం దత్తత తీసుకున్న గ్రామాలకు రూ. 69 కోట్ల నిధులు కేటాయించి 98 శాతం పనులు పూర్తి చేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్రెడ్డి యాద్గరిపల్లి, ఉద్దమర్రి, పొన్నాల, ఆదర్శపల్లి ద్వారా వెళ్లే మార్గాన్ని మిలిటరీ అధికారులు మూసివేశారని, అధికారులతో మాట్లాడి దారి సమస్య తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశం, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సునీత, గ్రామాల సర్పంచలు రవి, గోపీనాయక్, ఆంజనేయులు, కృపాకర్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, రాంచంద్రయ్య, శ్యామల, సుదర్శన్, విష్ణుగౌడ్, రమేశ్ ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి దత్తత గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎమ్మెల్యే సీతక్కకు ఏం తెలుసని మర్రి రాజశేఖరెడ్డి అన్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే సీతక్క టీఆర్ఎస్ పార్టీలో చేరుతారన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసి చూపిస్తున్నట్లు పేర్కొన్నారు.
అభివృద్ధిని అడ్డుకోవడానికే దీక్ష. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవద్దు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు రేపొద్దు. మూడుచింతలపల్లికి సీఎం కేసీఆర్ రూ. 29 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. – రవి, సర్పంచ్, మూడుచింతలపల్లి
అభివృద్ధిని చూసి మాట్లాడండి. ఎంపీగా ఉన్న రేవంత్రెడ్డి సొంత నియోజవర్గాన్ని అభివృద్ధి చేయకుండా ఇక్కడ చేస్తున్న అభివృద్ధిపై మాట్లాడటం సరికాదు. లక్ష్మాపూర్ గ్రామానికి సీఎం కేసీఆర్ రూ. 16 కోట్లు కేటాయించారు.-సింగం ఆంజనేయులు, సర్పంచ్, లక్ష్మాపూర్
దీక్ష పేరిట రాజకీయాలు చేస్తే సహించం. గో బ్యాక్ రేవంత్రెడ్డి. అభివృద్ధిని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. గ్రామాలు అభివృద్ధి చెందితే ఓర్వలేకపోతున్నరు. -గోపీనాయక్, సర్పంచ్, లింగాపూర్తండా