మేడ్చల్, నవంబర్ 8: అక్రమంగా గంజాయి, హశీశ్ ఆయిల్ను విక్రయిస్తున్న నిందితులను మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఎక్సైజ్ సీఐ జగన్మోహన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు కండ్లకోయ గ్రామంలో దాడులు నిర్వహించగా, జీడిమెట్లకు చెందిన విక్రమ్ (20) కండ్లకోయ వద్ద హశీశ్ ఆయిల్ను అమ్ముతూ పట్టుబడ్డాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు సాయివెంకటకృష్ణరెడ్డి(23), బెన్నాల రవిని పట్టుకున్నారు. ఈ ముగ్గురి వద్ద 140 గ్రాముల గంజాయి, 45 ఎంఎల్ హశీశ్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.
మన్సూరాబాద్, నవంబర్ 8: గంజాయి అక్రమ రవాణా చేస్తూ క్రయవిక్రయాలు జరుపుతున్న ఆరుగురిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మన్సూరాబాద్కు చెందిన గుండు ప్రశాంత్ (24), వెంకటరమణ కాలనీకి చెందిన అమర్థ్యన్ రెడ్డి (22), రాక్టౌన్కాలనీకి చెందిన బోర సామ్రాట్ (33) సాయి సప్తగిరికాలనీ వాసి పల్లపు అరవింద్ (19), జూబ్లీహిల్స్, ఎంసీఆర్ హెచ్ఆర్డీ క్యాంపస్కు చెందిన సుందర్రాజ్ (24), బొల్లారానికి చెందిన గుర్రం వెంకటేశ్ (31) డబ్బు సంపాదన కోసం గంజాయి రవాణా చేస్తున్నారు. ఆదివారం రాత్రి రాక్టౌన్కాలనీ సమీపంలోని ఇంద్రప్రస్త కాలనీ రోడ్డు నం. 6 వద్ద కళ్యాణ వేదిక రోడ్డులో గుండు ప్రశాంత్, అమర్థ్యన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఇచ్చిన సమాచారం మేరకు సామ్రాట్, అరవింద్, సుందర్రాజు, వెంకటేశ్లను పట్టుకొని ఆరుగురిని రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 12 గ్రాముల హశీశ్ ఆయిల్, 45 గ్రాముల గంజాయి, ఎలక్ట్రిక్ బైకు, 5 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఘట్కేసర్, నవంబర్8 : హశీశ్ ఆయిల్ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో ఎక్సైజ్ సీఐ మల్లయ్య ఆధ్వర్యంలో సిబ్బంది జవహర్నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న దినేశ్ (22), అఖిలేశ్(21) అనే వ్యక్తుల వద్ద హశీశ్ ఆయిల్ లభించింది. నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. వారి వద్ద 5 ఎంఎల్ ఉన్న 17 డబ్బాల హశీశ్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు.