కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 5: ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా..వాటిని జిహెచ్ఎంసి వాహనాలలో వేయండి, మేము తీసుకెళ్లి అవసరమైన వారికి అందజేస్తామని..కూకట్పల్లి సర్కిల్ (జిహెచ్ఎంసి) అధికారులు చేపట్టిన వినూత్నమైన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. కూకట్పల్లి జెడ్సీ అపూర్వ చౌహాన్ , డీసీ గంగాధర్ పర్యవేక్షణలో శనివారం సర్కిల్ పరిధిలోని హైదర్ నగర్ డివిజన్ లోని బృందావన్ కాలనీ, కూకట్పల్లి డివిజన్ లోని వెంకట్రావు నగర్, ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని ఆర్ ఆర్ కాలనీ, బాలానగర్ డివిజన్ లోనీ బాలానగర్ లో ప్రత్యేక వాహనాలతో ఇంటింటికి తిరుగుతూ పనికిరాని వస్తువులను సేకరించారు.
ఇంట్లో పనికిరాని కుర్చీలు, టేబుల్స్, పరుపులు ఇతర వస్తువులు, దుస్తులను ప్రత్యేక వాహనాల్లో సేకరించారు. ఈ విషయంపై సర్కిల్ ఎస్ డబ్ల్యూఎండీ ఈ శ్రీనివాస్ మాట్లాడుతూ..ఇంట్లో పనికిరాని వస్తువులను తీసుకెళ్లి ఖాళీ ప్రదేశాలలో వేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని తెలిపారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇంటింటికి తిరిగి పనికిరాని వస్తువులను సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా… మంచి స్పందన లభించింది అన్నారు. ఇదే తరహాలో అన్ని కాలనీలలో ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తామని తెలిపారు. ఆయా కాలనీల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.