కాప్రా : గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని కాప్రా చెరువు వద్ద గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకోసం కాప్రా చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లను కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్.శంకర్ మంగళవారం పరిశీలించారు. చెరువుకు వెళ్లే దారుల్లో గుంతలను పూడ్చడంతో పాటు, రోడ్లను మెరుగు పర్చేందుకు చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా సర్కిల్ ఈఈ కోటేశ్వర్రావు డీసీకి వివరించారు. నిమజ్జనాల సందర్భంగా చెరువు ఒడ్డు వద్ద చేసిన ఏర్పాట్లను, చిన్న గణపతులను నిమజ్జనం చేసేందుకు నిర్మించిన మినీ పాండ్ను డీసీ పరిశీలించారు.
చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న హైమాస్ట్ లైట్లను ఆయన పరిశీలించారు. అనంతరం డీసీ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనాలను పురస్కరించుకొని కాప్రాసర్కిల్తో పాటు మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్లు, కీసర మండలం పరిధిలోని పలు ప్రాంతాల వారు నిమజ్జనాలకోసం గణపతులను కాప్రా చెరువు వద్దకే తరలిస్తారనీ అందువల్ల నిమజ్జనాల కోసం వచ్చేమండపాల నిర్వాహకులకు, సందర్శకులకు ముఖ్యంగా మహిళలకు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ కోటేశ్వర్రావు, డీఈఈ బాలకృష్ణ, ఏఈఈ సరస్వతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.