మేడ్చల్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): వినాయక శోభాయాత్ర జరిగే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. మేడ్చల్ కలెక్టరేట్లో శనివారం వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిమజ్జనం నిర్వహించే ప్రాంతాల వద్ద క్రేన్లు, బారికేడ్లు , వేదికలను ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జనం జరిగే ఈ నెల 19న గజ ఈతగాళ్లను మత్స్యశాఖ అందుబాటులో ఉంచాలన్నారు. మండపాల వద్ద ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. అధికారులు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుని ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షించాలని సూచించారు. గణేశ్ ఉత్సవ కమిటీ సూచించే పలు విషయాలను అధికారులు పరిగణలోకి తీసుకోవాలన్నారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు , డీసీపీ రక్షితమూర్తి, డీఆర్వో లింగ్యానాయక్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, పోలీసు అధికారులు , గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.