మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 8 : నాగారం మున్సిపాలిటీని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతామని, ఇందుకు ప్రజలు సహకరించాలని చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలో ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై ప్రభుత్వ పాఠశాల, సెరినిటీ ప్రైవేట్ పాఠశాలల వెయ్యి మంది విద్యార్థులతో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ వాడకం, అమ్మకం పూర్తిగా నిషేధించామని, ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీకి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మున్సిపాలిటీలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లాస్టిక్ వస్తువులు ఎవరూ అమ్మవద్దు, కొనవద్దని సూచించారు. ప్రజలు వస్తువులు కొనుగోలు చేసినప్పుడు వాటిని నార సంచుల్లోనే తీసుకెళ్లాలని చెప్పారు. ప్లాస్టిక్ కవర్ల వల్ల కలిగే నష్టాలను వృత్తి వ్యాపారులు, కూరగాయల వ్యాపారులకు సూచించారు.
మున్సిపల్ పరిధిలోని వాణిజ్య, వ్యాపారస్తులు తడి, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోల్లో వేయాలని మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి అన్నారు. 75 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గ్లాసులు, వస్తువులను వాడరాదని సూచించారు. ప్లాస్టిక్ నిషేధాన్ని అతిక్రమించిన వారిపై ట్రాన్స్ఫోర్ట్ బృందం జరిమానా విధిస్తుందని, ఫిర్యాదుల కోసం 96400 10053 కు ఫోన్ చేయాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేశ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.