కీసర, మార్చి 18 : తెలంగాణలో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందిన కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొత్తం ఆదాయం రూ.79 లక్షల 98,040 ఆదాయం వచ్చిందని ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్రెడ్డి తెలిపారు. ఈనెల 9 నుంచి 14వ తేదీ వరకు కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. ఆరు రోజులకు సంబంధించి స్వామివారి హుండీతో పాటు ఇంకా టిక్కెట్లకు సంబంధించిన ఆదాయ వివరాలను ఆలయం నిర్వాహకులు వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆలయ ప్రాంగణంలో దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ ఫణికుమార్ ఆధ్వర్యంలో స్వామివారి హుండీని లెక్కించారు. హుండీ ద్వారా రూ.26 లక్షల 76వేల 263, అభిషేకానికి సంబంధించి రూ.2లక్షల 68000 వేలు , వీఐపీ దర్శనం ద్వారా టిక్కెట్లకు గాను రూ.4లక్షల 65వేల 200, శీఘ్రదర్శనం ద్వారా రూ.20లక్షల 56వేల 800, జనరల్ ఇన్కం , ప్రసాదం, హుండీతో మొత్తం ఆలయానికి రూ.79లక్షల 98,040 ఆదాయం సమకూరిందని వారు తెలిపారు. గత సంవత్సరం 2020కు గాను స్వామివారికి రూ.82,01,129 లక్షల ఆదాయం వచ్చింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రూ.2,03,089లక్షల ఆదాయం తక్కువగా వచ్చింది.