కొత్తూరు, ఏప్రిల్ 27 : నందిగామ మండల కేంద్రం లో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదం మరింత తీవ్రమయింది. నిన్న రాత్రి వరకు మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. మధ్యరాత్రి మంటలు మెయిన్ బిల్డింగ్కు వ్యాపించాయి. దీంతో వాటిని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మంటలు అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ చెలరేగాయి. అందులో ఉన్న కెమికల్స్ మళ్లీ అంటుకుంటుండంతో మంటలు అదుపులోకి రావడం లేదని ఫైర్ సిబ్బంది చెబుతున్నారు. దీంతో సిబ్బందికి ఏం చేయాలో పాలు పోవడంలేదు.
అయితే శనివారం వరకు కూడా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. పరిశ్రమ గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద మొత్తంలో కెమికల్స్ ఉన్నాయని పరిశ్రమ యాజమాన్యం చెప్పింది. ఒక వేళ ఆ మంటలు గ్రౌండ్ ఫ్లోర్కు వ్యాపిస్తే బిల్డింగ్ మొత్తం బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందని ఫైర్ సిబ్బంది చెబుతున్నారు. రూ.25 కోట్ల వరకు నష్టం జరిగిందని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా పాత జాతీయ రహదారి ఓ వైపు పూర్తిగా క్లోజ్ చేశారు. సాయంత్రానికి మంటలు కొంచెం తగ్గడంతో రోడ్డును తిరిగి పునరుద్ధరించారు.