మణికొండ, జనవరి 30 : మణికొండ మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం మంగళవారం రసాభాసగా జరిగింది. ఐదు మాసాలుగా ప్రజాసమస్యలను గాలికొదిలి..ఇప్పుడు టేబుల్ ఎజెండా అంటూ ఏవిధంగా కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తారంటూ మెజార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలో అధికారులు పనిచేస్తున్నారా? లేక కాలయాపన కోసం కార్యాలయానికి వచ్చి వేతనాలు పొందుతున్నారా? అంటూ మండిపడ్డారు.
మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశం చివరకు కొన్ని అత్యవసర వేతనాల చెల్లింపులు తప్పా మిగతా తీర్మానాలను నిలిపివేశారు. ప్రజాపరిపాలనలో విధులు నిర్వహించిన ఉద్యోగులకు, ఇతర అవసరాల కోసం మాత్రమే నిధులను చెల్లించేందుకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. అత్యవసర పనులకు ప్రాధాన్యత కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో మరోసారి సమావేశం నిర్వహించాలని పట్టుబట్టారు.
పరిపాలనలో పారదర్శకత లోపించడంపై మున్సిపల్ కౌన్సిలర్లు.. కమిషనర్ ఫల్గుణ్కుమార్ను ప్రశ్నించారు. దీంతో కమిషనర్కు, సభ్యులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం వల్ల దాదాపు ఐదు నెలలుగా సమావేశం జరుగలేదు. మంగళవారం సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు, అలాగే టేబుల్ ఎజెండా పైన సమాచారం ఇవ్వలేదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదనపు కలెక్టర్ సమక్షంలో బడ్జెట్ సమావేశం
వాడివేడిగా సాగిన కౌన్సిల్ సమావేశం అనంతరం నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో ఆమోదయోగ్యంగా సభ్యులు చర్చించి పలు తీర్మానాలను ఆమోదించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మణికొండ మున్సిపాలిటీలో మంగళవారం రెండో విడత నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లంతా ఒకే తాటిపైకి వచ్చి ప్రజాసమస్యలపై సుదీర్ఘంగా చర్చించి అవసరమైన పనులకు నిధులను వెచ్చించాలని ఆమోదముద్ర వేశారు. అనంతరం అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై రాజకీయాలకు అతీతంగా సభ్యులంతా ఆమోదించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ నరేందర్రెడ్డి, కమిషనర్ కె.ఫల్గుణ్కుమార్, ప్లోర్లీడర్ కె.రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.