సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 3: బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ అభివృద్ధి పనులు, పథకాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పోడు పట్టాల పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. లబ్ధిదారులకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు మంత్రి అందజేయనున్నట్టు వెల్లడించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల మేరకు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని స్పష్టం చేశారు. పథకంలో భాగంగా ఒక్కో లబ్ధిదారుడికి రూ.3 లక్షలు ఇస్తారని, 100 శాతం సబ్సిడీ లభిస్తుందన్నారు. అర్హులైన కుటుంబంలోని మహిళల పేరున గృహలక్ష్మి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు. హరితహారం జిల్లా లక్ష్యాన్ని ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యం మేరకు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
రెండో విడత గొర్రెల పంపిణీ వేగంగా పూర్తి చేయాలి
జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. కస్టం మిల్లింగ్ రైస్ వేగవంతంగా ఎఫ్సీఐకి డెలివరీ చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారికి సూచించారు. మన ఊరూరు -మన బడి కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధితులకు సూచించారు. రెండో విడత దళితబంధు పథకంలో లబ్ధిదారులను గుర్తించాలన్నారు. అందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారుల నియామకం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి సూచించారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లోని వైకుంఠధామాలకు నీటి వసతి, విద్యుత్ సౌకర్యం 100 శాతం కల్పించాలన్నారు. పీహెచ్సీ సబ్ సెంటర్ భవన నిర్మాణాలకు 100 శాతం గ్రౌండింగ్ పూర్తి కావాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్వో నగేశ్, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆయా సంక్షేమ శాఖల, విద్యా, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.