దుండిగల్, డిసెంబర్ 28 : చూడ్డానికి సాఫ్ట్వేర్లా ఉంటాడు.కానీ సాఫ్ట్వేర్ కాదు. బైక్ దొంగతనాలకు పాల్పడుతాడు. కానీ దొంగలించిన వాటిని అతడి వద్ద పెట్టుకోడు. విక్రయించి సొమ్ము కూడా చేసుకోడూ.. కేవలం కొత్త వాహనాలే అతగాడికి కిక్కు. పార్కింగ్ చేసి తాళం వాహనానికే మరిచిపోయిన బైక్స్ను టార్గెట్గా చేసుకుంటాడు. ఇక అతడి వద్ద అప్పటి వరకు ఉన్న వాహనాన్ని అక్కడే వదిలేసి కొత్తగా కన్పించిన ద్విచక్రవాహనాన్ని దొంగలించే వెరైటీ దొంగ అతను. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుతిరుగుతున్న ఈ విచిత్ర దొంగను పట్టుకునేందుకు.. బాచుపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. బాచుపల్లి పీఎస్ పరిధి, నిజాంపేటలో పిజ్జాను హోండెలివరీ చేసేందుకు ఓ డొమినోస్ పార్ట్టైం ఉద్యోగి ఈ నెల 18న సాయంత్రం బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద తన ద్విచక్ర వాహణాన్ని(హోండాఆక్టీవా5జీ) నిలిపి కస్టమర్కు పిజ్జాను అందజేసేందుకు లోపలికెళ్లి కొద్దిసేపట్లో తిరిగి వచ్చాడు. అయితే అప్పటికే అతని బైక్ మాయమైంది.ఆందోళనతో ఒకటికి రెండు సార్లు వెతికాడు.
తనబైక్ తస్కరణకు గురైనట్లు గుర్తించి సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఓ వ్యక్తి మరోబైక్పై డాబుగా వచ్చి తన బైక్ను పార్క్ చేశాడు. పక్కనే నీట్గా కొత్తగా ఉన్న డొమినోస్ డెలివరీ బాయ్ బైక్ను తీసుకుని వెళ్లాడు. దీంతో బాధితుడు బాచుపల్లి పోలీసులకు ఈ విషయమై అదే రోజు ఫిర్యాదు చేశాడు.అయితే విచిత్రంగా దొంగ వదిలివెళ్లిన పాతబైక్ను దాని యజమాని ఆ మరుసటి రోజు అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఇదే తరహాలోనే అంతకు రెండు రోజుల ముందు సైతం నిజాంపేటలోని ఓ ఫొటో స్టూడియో వద్ద కొత్తగా నిలిపి ఉంచిన(తాళం దానికే ఉంది) ద్విచక్రవాహనాన్ని చూసిన వెరైటీ దొంగ అతగాడు తెచ్చుకొన్న పాత బైక్ను అక్కడే వదిలేసి కొత్తదాన్ని కొట్టేసి..అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే దొంగ కొట్టేసిన వాహనం బేగంపేట పీఎస్ పరిధిలో లభ్యం కావడంతో పోలీసుల దృష్టిలో వెరైటీ దొంగగా గుర్తింపును తెచ్చుకున్నాడు. వెరైటీగా ద్విచక్రవాహనాలను తస్కరిస్తున్న అతగాడిని పట్టుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అతన్ని పట్టుకుని తీరుతామంటున్నారు బాచుపల్లి పోలీసులు.