బొంరాస్పేట, జనవరి 10 : సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా పతంగుల సందడే కనిపిస్తుంది. వచ్చే శుక్రవారం నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు రావడంతో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో గాలి పటాలు ఎగురవేసే దృశ్యాలు కనిపిస్తాయి. ఆకాశ వీధిలో రంగు రంగుల పతంగులు కనువిందు చేస్తుంటాయి. పిల్లలంతా ఒకచోట చేరి ఉత్సాహంగా పతంగులను ఎగురవేస్తుంటారు. ఇదంతా ఒకవైపు ఉంటే పండుగ వేళ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వినోదం కాస్తా విషాదంగా మారే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా విద్యుత్ తీగలకు చిక్కుకున్న పతంగులను తీయబోయి విద్యుదాఘాతానికి గురవుతుంటారు. ఎత్తయిన భవనాలపైకి ఎక్కి కిందపడుతుంటారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగి చిన్న పిల్లలు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు కుటుంబాలలో విషాదం నింపుతాయి. అందుకే గాలిపటాలు ఎగురవేసే సమయంలో పిల్లలపై పెద్దల పర్యవేక్షణ తప్పక ఉండాలి.