తాండూరు, ఫిబ్రవరి 18: మహాశివరాత్రి వేడుకలు శనివారం తాండూరు నియోజకవర్గంలో భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ప్రసిద్ధమైన అంతారం తండాలోని భూకైలాస్ ఆలయం, బషీరాబాద్ మండలం నీళ్లపల్లిలోని ఏకాంబరి, జీవన్గి, పెద్దేముల్ మండలం తట్టెపల్లి సమీపంలోని అంబురామేశ్వర ఆలయం, యాలాల మండలం సంగెంకుర్ధులోని సంగమేశ్వర ఆలయం, తాండూరు మున్సిపల్ పరిధిలోని భావిగి భద్రేశ్వర ఆలయం, చెరువెంటి ఈశ్వరాలయం, అంతప్పబావి శివాలయం, కోటేశ్వర ఆలయంతో పాటు పలు శివాలయాల్లో శివుడికి భక్తి శ్రద్ధలతో భక్తులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, జలాభిషేకం, పాలాభిషేకం, రుద్రాభిషేకం, అర్చనలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు పరమ శివుడిని దర్శించుకుని దీక్ష విరమించడానికి ఆలయాలకు తరలిరావడంతో భక్తుల సందడితో శివాలయాలు కిటకిటలాడాయి. హర హర మహాదేవ… శంబో శంకర… అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. బ్రహ్మకుమారి సమాజం తాండూరు శాఖ కేంద్రంలో ఇన్చార్జి జగదేవి ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ శేఖర్గౌడ్ పాల్గొన్నారు. శివాలయాల్లో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులను, నిర్వాహకులను పలువురు అభినందించారు.
తాండూరు రూరల్ : మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శనివారం తాండూరు మండలం అంతారంతండాలో వెలిసిన భూకైలాస్ శివ నామస్మరణతో మార్మోగింది. గౌతాపూర్ సమీపంలోని చెరువెంటి ఈశ్వరుడి ఆలయాన్ని భక్తులు దర్శించుకున్నారు. భూ కైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు ప్రతిష్ఠించిన 9 శక్తీపీఠాలను భక్తులు సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. భూ కైలాస్ను రాష్ట్ర బీసీ సంఘం సభ్యుడు శుభ ప్రద్పటేల్, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి కుమారుడు రినీశ్రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వారిని ఆలయ నిర్వాహకులు శంకర్నాయక్, వాసు నాయక్ పవర్ సాదరంగా ఆహ్వానించారు. భక్తులకు ఆలయ ప్రాంగణంలో అన్నదానం చేపట్టారు. అలాగే 60 అడుగుల ఎత్తులో ఉన్న శివుడి విగ్రహంపై డ్రోన్ సాయంతో పుష్పాభిషేకం చేశారు. 40 అడుగుల ఎత్తులో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహంతోపాటు కాలభైరవుడు, వీరభద్రుడు, నందీశ్వరులు, సిద్ధివినాయక విగ్రహాలను, నీటి మార్గంలో ఏర్పాటు చేసిన శివలింగాలను భక్తులు దర్శించుకున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అఖండ దీపారాధన చేశారు. చుట్టు పక్కల మండలాల భక్తులతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన వారు తరలివచ్చారు.
మహాశివరాత్రి సందర్భంగా అంతారంతండాలోని గిరిజన మహిళలు స్వామి వారికి బోనమెత్తి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ నిర్వాహకులు శంకర్ నాయక్ పవర్, వాసూనాయక్ పవర్ స్వామి వారి పల్లకీని ఊరేగించారు. గిరిజన మహిళలు బోనాలతో నృత్యం చేస్తూ స్వామికి చెంతకు చేరుకున్నారు. అనంతరం గిరిజన మహిళలు స్వామి వారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకొన్నారు.
బొంరాస్పేట : మహాశివరాత్రి పర్వదినాన్ని శనివారం బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. పండుగ సందర్భంగా వివిధ గ్రామాల్లో శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. ఉపవాస దీక్షలు చేపట్టిన ప్రజలు ఉదయం నుంచే ఆలయాలను దర్శించుకుని పూజలు చేశారు. భక్తులు పరమ శివుడిని పంచామృతంతో అభిషేకం చేశారు. సాయంత్రం పండ్లు తీసుకుని ఉపవాస దీక్షలు విరమించారు. బొంరాస్పేట సమీపంలోని సంగమేశ్వర ఆలయం, నాగిరెడ్డిపల్లి సమీపంలోని పరమేశ్వర ఆలయానికి మండలంలోని భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. నాందార్పూర్లో శివపార్వతుల పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. గౌరారం, దేవులానాయక్తండా, మెట్లకుంట, రేగడిమైలారం గ్రామాల్లోని శివాలయాల్లో భక్తులు శివుడికి పూజలు చేశారు. ఆలయాల్లో రాత్రంతా భజనలు చేసి జాగారం చేశారు. మదనపల్లితండాకు సమీపంలోని ఇబ్రహింపూర్తండాలో శివస్వాములు పూజలు చేశారు. తండాకు చెందిన శంకర్నాయక్ ఆలయానికి రూ.5,100 విరాళం అందజేశారు. దుద్యాల సమీపంలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శివస్వాములు ఘనంగా మెట్లపూజ నిర్వహించారు.
నవాబుపేట : మండలంలోని యెల్లకొండ గ్రామంలోని పార్వతీపరమేశుడికి ఆలయ చైర్మన్ పట్లోళ్ల భరత్రెడ్డి సతీసమేతంగా మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతి పురాతన ఆలయం కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
పరిగి : పరిగి పట్టణంతోపాటు మండల పరిధిలోని గ్రామాల్లో శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పరిగి పట్టణంలోని అనంతరెడ్డినగర్లో భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం, బహార్పేట్ శివాలయం, టీచర్స్కాలనీ హనుమాన్మందిర్లో శివలింగం, పాత పరిగిలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. మల్లికార్జున స్వామి ఆలయంలో జడ్పీటీసీ హరిప్రియాప్రవీణ్కుమార్రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కులకచర్ల : మండల పరిధిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆయా గ్రామాల్లోని ఆలయాలను సందర్శించి శివుడికి అభిషేకంతో పాటు పూజలు చేశారు. పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ కమిటీ చైర్మన్ రాములు, ఈవో సుధాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర స్వామిని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, ఈవో సుధాకర్, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, శ్రీనివాస్, మొగులయ్య, వెంకటయ్య, దామోదర్రెడ్డి, జనార్దన్రెడ్డి, నర్సింహులు, డీసీసీబీ మాజీ చైర్మన్ కమతం శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
చౌడాపూర్ మండల పరిధిలోని మందిపల్లో హోంకారేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మఠం ప్రమీల, పూజారి మఠం రాజశేఖర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు.
మర్పల్లి : మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు సాయంత్రం శివాలయం వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి ఉపవాస దీక్షలు విరమించారు.
కోట్పల్లి : మండలంలో మహాశివరాత్రి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. సాయంత్రం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్షలను విరమించారు. ఇందోల్లోని రామలింగేశ్వరస్వామి ఆలయం, కోట్పల్లి శివాలయం, బుగ్గాపూర్ రామలింగేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
బషీరాబాద్ : మండలంలోని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. శనివారం మండలంలోని అన్ని గ్రామాల్లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు శివాలయాల్లో అభిషేకాలు, కుంకుమార్చన నిర్వహించి పూజలు చేశారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తండ్రి విఠల్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి తనయుడు రినేశ్రెడ్డి నీళ్లపల్లి ఏకాంబర రామలింగేశ్వరుడికి, నవాంద్గీ సంగమేశ్వరుడిని, జీవన్గి మహాదేవలింగేశ్వరుడిని, ఎక్మాయి శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.