బషీరాబాద్, నవంబర్ 29 : మండల పరిధిలోని కొర్విచెడ్ గ్రామ శివారులో మల్లన్న స్వామి జాతర మంగళవారం వైభవంగా జరిగింది. ఏటా సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ జాతరకు మండల ప్రజలతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. సాయంత్రం 4 గంటలకు మల్లన్న స్వామి ఉత్సవ విగ్రహాన్ని గ్రామ పురవీధుల గుండా పల్లకీలో ఉరేగించి ఆలయానికి తీసుకొచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, స్వామివారి దర్శనం వద్ద లైన్లతో పాటు పలు వసతులను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. ఎస్సై విద్యాచరణ్రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.