రంగారెడ్డి, జూన్ 11 (నమస్తే తెలంగాణ): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాహితీ దినోత్సవం వైభవోపేతంగా జరిగింది. కవులు, కళాకారులు తమ ప్రతిభను చూపి అలరింపజేశారు. తెలంగాణ రాష్ట్ర పది వసంతాల ప్రగతి, సంక్షేమంపై కవితలు, పాటల రూపంలో వినిపించారు. ‘పది వసంతాల నా తెలంగాణ.. పరిఢవిల్లాలి నవ భారతాన’ అంటూ కవిత రూపంలో చెప్పగా, మరొక కవయిత్రి ‘తెలంగాణ బిడ్డరా.. త్యాగధనుల గడ్డరా..’ అంటూ అక్కడున్న వారిని ఉత్తేజపరిచారు. వికారాబాద్ కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి పాల్గొని మాట్లాడారు. కవులు, కళాకారులను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ తిరుపతిరావు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. అనంతరం వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కవులు, కళాకారులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలోని కవులు, రచయితల సాహితీ కచేరీకి ఆదివారం కలెక్టరేట్ భవనం వేదికైంది. జిల్లాలోని కవులంతా ఒక్క వేదికపై చేరి సాహితీ పరిమాళాలలను విరబూయించారు. దాదాపు 50 మంది సాహితీవేత్తలు ‘గత తెలంగాణ, ఉద్యమ తెలంగాణ, ఉద్యమ పరిణామ తెలంగాణ, అవతరణ తెలంగాణ, సంక్షేమ తెలంగాణ, సీఎం కేసీఆర్-తెలంగాణ ప్రభుత్వ పని తీరు’ వివిధ సాహితీ ప్రక్రియల్లో వారి కవిత్వ రచనాశైలిని, ధోరణిని వినసొంపుగా వినిపించారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాహితీ దినోత్సవం కావడంతో కవులు సాహితీ సంపత్తిని శ్రోతలకు అందించారు. ‘దశాబ్దిలో తెలంగాణ ధరణిపై వెలిగింది.. పదేండ్లలో తెలంగాణ ప్రగతిబాట పట్టింది’ అంటూ ఓ కవి ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని తన కవితారూపంలో అందంగాఆవిష్కరించారు.
మరోకవి ‘పచ్చనైన పాడి పంటలతో సాగుతున్నది తెలంగాణ.. పది వసంతాల స్వప్నంగా..’ అని పాడి పంటలతో విరాజిల్లుతున్న తెలంగాణను కండ్లకు కట్టినట్లు తన గాన మాధుర్యంతో వినిపించారు.‘తెలంగాణ వైభవకాంతి కిరణం.. కేసీఆర్’ అంటూ మరొకరు తెలంగాణ పురోగతి వైభవాన్ని ఆవిష్కరించి, సీఎం కేసీఆర్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను తన కవితలో జోడించారు. ‘జయము.. జయము తెలంగాణ .. జయము నీకు తెలంగాణ’ అంటూ ఒక రచయిత తెలంగాణ సాధించిన విజయాల్ని స్మరించుకుంటూ రచన చేశారు. ఇంకొకరు ‘పది వసంతాల నాతెలంగాణ.. పరిఢవిల్లాలి నవ భా రతాన’ అంటూ ప్రస్తుత ప్రగతిని, రేపటి భవి ష్యత్తును తన కవిత రూపంలో వివరించారు. మరొక కవయిత్రి ‘తెలంగాణ బిడ్డరా.. త్యాగధనుల గడ్డరా..ఉద్యమాల పోరుకు ఊపిరి పోసిందిరా’ అంటూ ఉద్యమ తెలంగాణ వాతావరణా న్ని బ్రహ్మాండంగా ఆవిష్కరించారు. ఇలా 48 మంది సాహితీవేత్తలు తమ కలాలను కదిలించి కవితాపటిమను చాటారు. సాహితీ దినోత్సవం ఆసాంతం ‘జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై భార త్’ నేపథ్యంలోనే కొనసాగింది. సాహితీవేత్తలు సీఎం కేసీఆర్ను రాజ పోషకులుగా వర్ణించారు.
అమరుల త్యాగఫలం ‘తెలంగాణ’అదనపు కలెక్టర్ తిరుపతిరావు
దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం కొంగరకలాన్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ తిరుపతిరావు అధ్యక్షతన తెలంగాణ సాహిత్య దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన ఈ రాష్ట్రం.. అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ ఇతర రా ష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. రాష్ట్ర అభివృద్ధే అమరులకు అసలైన నివాళి అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు ముఖ్యభూమిక పోషించారని గుర్తు చేశారు. అలాంటి కవులు, కళాకారులు, సాహితీవేత్తలను గౌరవించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా సాహితీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నదన్నారు. అనంతరం ఆయన కార్యక్రమంలో పాల్గొని తమ కవితలను వినిపించిన 48 మం ది కవులను ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి, జ్ఞాపికలు, ప్రశంసాపత్రంతోపాటు ఒక్కొక్కరికి రూ.1,116 చొప్పున అందించా రు. కార్యక్రమంలో డీఆర్వో హరిప్రియ, జడ్పీ సీఈవో దిలీప్కుమార్, జడ్పీ డిప్యూటీ సీఈవో రంగారావు, కేశంపేట జడ్పీటీసీ, చైల్డ్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ విశాల, ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి, జిల్లా యువజన క్రీడలాధికారి వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.