సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : కొత్త సంవత్సరం వేడుకల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. మరో పక్క సైబరాబాద్లో మద్యం మత్తులో ఒక కానిస్టేబుల్ బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదం చేసి ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు. హైదరాబాద్లో హోటల్లో బిర్యానీలో ముక్కలు రాలేదని, చల్లగా ఉందంటూ ప్రశ్నించిన పాపానికి హోటల్లో పనిచేసే సిబ్బంది యజమాన్యంతో కలిసి కస్టమర్లను చితకబాదారు. వీటితోపాటు ట్రై కమిషనరేట్ల పరిధిలో అక్కడక్కడ చిన్నచిన్న గొడవలు, ప్రమాదాలు మినహా న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి.
న్యూ ఇయర్ వేడుకలకు భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామంటూ మూడు రోజుల ముందు నుంచే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రై పోలీస్ కమిషనర్లు శ్రీనివాస్రెడ్డి, అవినాష్ మహంతి, సుధీర్బాబు హెచ్చరిస్తూ వచ్చారు. అయినా మందుబాబులు న్యూ ఇయర్ వేడుకల్లో మందులో మునిగి తేలి అడ్డంగా దొరికిపోయారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 3 వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైనవారు 1న ఉదయం హైదరాబాద్లోని గోషామహల్ ట్రాఫిక్ శిక్షణ కేంద్రానికి కౌన్సెలింగ్కు తరలివెళ్లారు.
ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరుగకుండా కట్టడి చేసేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. అయినా అక్కడక్కడ ప్రమాదాలు జరిగాయి. ప్రతి ట్రాఫిక్ ఠాణా పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి రెండు చోట్ల తప్పని సరిగా నిర్వహించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయినా చాలా మంది మందుబాబులు మందు తాగి రోడ్లపై చిందులు వేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. కూకట్పల్లిలో ఎస్ఆర్నగర్ ఠాణాలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మల్లికార్జున్ మద్యం మత్తులో ద్విచక్రవాహనాన్ని నడుపుతూ కేఎల్ఎం బట్టల షాప్లో పనిచేసే దుర్గయ్య(58)ను ఢీకొట్టడంతో మృతి చెందాడు. స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు.
మరో పక్క అబిడ్స్లో దూల్పేట్కు చెందిన సుమిత్సింగ్ మరో ఏడుగురితో కలిసి గ్రాండ్ హోటల్లో రాత్రి భోజనానికి వచ్చాడు. వివిధ వంటకాలను అర్డర్ చేశారు. అందులో మటన్ బిర్యానీ చల్లగా ఉందని.. సరిగ్గా ఉడకలేదంటూ వెయిటర్కు చెప్పారు. వెయిటర్ దానిని వేడి చేసి తిరిగి తెచ్చాడు. బిర్యానీ సరిగ్గా లేదని.. దీనికి తాము బిల్లు చెల్లించబోమంటూ దూల్పేట్ వాసులు చెప్పారు.
బిల్లు కౌంటర్ వద్దకు వచ్చిన తరువాత కూడా మటన్ బిర్యానీ బిల్లుపై వాగ్వాదం జరిగింది. దీంతో హోటల్లో పనిచేసే సర్వర్లు, ఇతర పనివాళ్లు దూల్పేట్ వాసులను చితకబాదారు. హోటల్ యజమానితో పాటు దాడికి పాల్పడిన వారిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై స్థానిక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించి హోటల్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.