పారిశ్రామికంగా రంగారెడ్డి జిల్లా రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నది. ఇప్పటికే ఫార్మాసిటీ, అమెజాన్, టీసీఎస్ వంటి పలు దిగ్గజ కంపెనీలు ఏర్పాటయ్యాయి. తాజాగా మంచాల మండలంలోని తాళ్లపల్లిగూడలో ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు అవసరమైన 473 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించగా, టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో భూసేకరణకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలోనే మరిన్ని పరిశ్రమలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు పరిశీలిస్తున్నది. ఈ పరిశ్రమల ఏర్పాటుతో మండలవాసులకు భారీగా ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
ఇబ్రహీంపట్నం, జూలై 25 : జిల్లాలోని మారుమూల ప్రాంతమైన మంచాల మండలంలోని తాళ్లపల్లిగూడ గ్రామ శివారుల్లో భారీ ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్కు సంబంధించిన యూనిట్లతోపాటు మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పరిశీలనలో ఉంది. జిల్లాలోని తాళ్లపల్లిగూడలో ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. తాళ్లపల్లిగూడ గ్రామంలోని సర్వే నం.84లో 473ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని గతంలో భూములులేని నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ భూమిలో పట్టాలు పొందినవారికి పరిహారాన్ని అందజేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం తీసుకోవాలని యోచిస్తున్నది.
దీనికోసం ఇప్పటికే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని గుర్తించడంతోపాటు ఇందులో ఎంతమంది పట్టాలు పొందిన రైతులున్నారనే దానిపై కూడా జాబితాను తయారుచేసింది. దీంతో పాటు పట్టాలు లేకుండా మరికొంతమంది భూములులేని పేదలు ఈ భూమిని సాగుచేస్తున్నారు. పట్టాలు పొందినవారితో పాటు ఎన్నో ఏండ్లుగా భూమిసాగు చేస్తున్న రైతులను కూడా గుర్తించి వారందరికీ పరిహారాన్ని ఇప్పించే యోచనలో రెవెన్యూ అధికారులున్నారు. తాళ్లపల్లిగూడ నుంచి సరళమైసమ్మ వెళ్లే దారిలోగల గూడెం కంచెలో ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలతో పాటు దాని అనుబంధ సంస్థలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని ప్రభుత్వం విశ్వసిస్తున్నది. ప్రభుత్వం అనుకున్న విధంగా త్వరితగతిన భూసేకరణ పూర్తయితే ఫుడ్ ప్రాసెసింగ్కు సంబంధించి అనేక సంస్థలు ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి.
టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో భూ సేకరణకు ఏర్పాట్లు
మంచాల మండలంలోని తాళ్లపల్లిగూడ గ్రామంలోని గూడెంకంచెలో గల ప్రభుత్వ భూమిలో పట్టాలు పొందిన రైతులను ఒప్పించి భూసేకరణ చేపట్టాలని టీఎస్ఐఐసీ అధికారులు యోచిస్తున్నారు. మరో వారం రోజుల్లో టీఎస్ఐఐసీ అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి రైతులతో సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతో టీఎస్ఐఐసీ అధికారులు ఈ భూమిని స్వాధీనం చేసుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం ముందుకొచ్చే వారికి కేటాయించాలని భావిస్తున్నారు. స్థలాలు కేటాయించిన తరువాత దీర్ఘకాలికంగా యూనిట్లను ఏర్పాటు చేయకుండా ఉండేవారికి కాకుండా త్వరితగతిన యూనిట్లను ఏర్పాటు చేసేవారికే ప్రాధాన్యతనివ్వాలని భావిస్తున్నారు. ఈమేరకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, రెవెన్యూ అధికారులు అఖిలపక్ష నాయకులతో చర్చించి రైతులను ఒప్పించి తగిన పరిహారం ఇప్పించేందుకు తగిన కార్యాచరణ రూపొందిస్తున్నారు.
మరింత అభివృద్ధి చెందనున్న మంచాల మండలం
జిల్లాలోని మారుమూల ప్రాంతమైన మంచాల మండలాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తాళ్లపల్లిగూడలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇక్కడ ఏర్పాటైతే ఈ ప్రాంతంలో భూముల ధరలు మరింత పెరుగడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. పారిశ్రామిక ప్రగతిలో పరుగులు పెడుతున్న రంగారెడ్డిజిల్లాలో అన్ని ప్రాంతాల అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది.
రైతులకు తగిన పరిహారం ఇప్పించిన తరువాతే భూ సేకరణ : మంచిరెడ్డి కిషనరెడ్డి, ఎమ్మెల్యే
తాళ్లపల్లిగూడలో ఎన్నో ఏండ్లుగా ప్రభుత్వ భూములు సాగుచేసుకుని జీవిస్తున్న రైతులకు తగిన పరిహారం ఇప్పించిన తరువాతే భూసేకరణ పనులు ప్రారంభిస్తాం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎలిమినేడు, ఆదిబట్ల, యాచారంతో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల కంపెనీలకు సంబంధించిన భూముల రైతులకు తగిన పరిహారం ఇప్పించిన తరువాతే భూముల సేకరణ జరిగింది. త్వరలో తాళ్లపల్లిగూడలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించిన భూముల్లో రైతులకు సరైన పరిహారం ఇప్పించి న్యాయం చేస్తాం.
గ్రామంతో పాటు మండలం అభివృద్ధి చెందుతుంది
– శ్రీనివాస్రెడ్డి, తాళ్లపల్లిగూడ సర్పంచ్
తాళ్లపల్లిగూడ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. వెనుకబడిన మంచాల మండలంలో ఈ ప్రభుత్వ రంగ కంపెనీలు రావడం సంతోషకరం. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందు ఎన్నో ఏండ్లుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న రైతులకు తగిన పరిహారం అందించాలి.