సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా కేంద్రంగా గ్రీన్ఫీల్డ్ హైవే సెగలు పుట్టిస్తున్నది. హెచ్ఎండీఏ ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ హైవే చిన్న, సన్నకారు రైతుల భూములే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. కాంగ్రెస్ సర్కారు చేపట్టిన గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణంతో జీవనాధారం కోల్పోతున్నామని రైతులు మండిపోతున్నారు. గ్రీన్ఫీల్డ్ భూబాధితులు సోమవారం పెద్ద ఎత్తున హెచ్ఎండీఏకు చేరుకోని ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతులతో చెలగాటం ఆడుతున్నదని.. చిన్న, సన్నకారు రైతులకు సాగుచేసుకునే భూములే లేకుండా చేసి, వారి మనుగడ ప్రశ్నార్థకంగా చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓఆర్ఆర్ నుంచి..ట్రిపులార్ మధ్య
అవుటర్ రింగ్రోడ్డు(ఓఆర్ఆర్) నుంచి రీజినల్ రింగ్రోడ్డు (ట్రిపులార్)మధ్య రవాణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ క్రమంలో నగరం నలువైపులా 10 రేడియల్ రోడ్లు రానుండగా..ఇప్పటికే రేడియల్ రోడ్-1ను ఫ్యూచర్సిటీ మార్గంలో నిర్మించనున్నారు. తాజాగా ఓఆర్ఆర్ నుంచి వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని చిట్యా ల్ వరకు రేడియల్ రోడ్డు-2ను నిర్మించేందుకు హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. 100 మీటర్ల వెడల్పుతో సుమారు 52 కిలోమీటర్ల మేర నిర్మించే రోడ్డు కోసం శంషాబాద్, షాబాద్, కొందుర్గు, చౌదర్గూడెం, మెయినాబాద్, పరిగి మండలాల పరిధిలోని 25 గ్రామాల్లోని వ్యవసాయ భూముల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మెజార్టీ భూములన్నీ చిన్న, సన్నకారు రైతుల వద్దనే ఉండగా, రేడియల్ రోడ్లతో తమ జీవనాధారమే కోల్పోతామని పరిగి మం డలానికి చెందిన రైతులు రోడ్డెక్కారు.
సాగు భూములు బలి..
రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం విలువైన, సారవంతమైన వ్యవసాయ భూములను కాంగ్రెస్ సర్కారు తమ నుంచి బలవంతంగా తీసుకోవాలని చూస్తున్నదని పరిగి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 300 ఫీట్ల రోడ్డుతో తమ ప్రాంతానికి వచ్చే ప్రయోజనం ఏమిటో రేవంత్ సర్కారు చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం కంపెనీలకు చెందిన భూములకు డిమాండ్ తీసుకొచ్చేందుకే గ్రీన్ ఫీల్డ్ హైవేల నిర్మాణం పేరిట రైతులను రోడ్డున పడేస్తున్నారని రైతు నర్సిరెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఉన్న 30 ఫీట్ల రోడ్డుకు రెండేండ్లలో తట్టెడు మట్టి పోసి గుంతలు పూడ్చలేని కాంగ్రెస్ ప్రభు త్వం.. పేదల భూములను లాక్కోని నిర్మించే గ్రీన్ ఫీల్డ్హైవే ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. అయితే తాజా నోటిఫికేషన్ నుంచి తమ గ్రామాలను తొలగించాలని, సాగు భూములను భారీ రహదారులకు మార్చి రియల్ ఎస్టే ట్ వ్యాపారులకు లబ్ధి చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.