రంగారెడ్డి, జనవరి 24(నమస్తే తెలంగాణ): రేషన్ పంపిణీలో పారదర్శకతను తేవడంతోపాటు బోగస్ రేషన్ కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఈ-కేవైసీకి ఇంకా ఏడు రోజుల గడువు మాత్రమే ఉన్నది.
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు ఈ-కేవైసీ ప్రక్రియ 86 శాతం పూర్తికాగా.. ఇంకా 14 శాతం మంది వేలి ముద్రలు వేయాల్సి ఉంది. గడువు దగ్గర పడడంతో వేలి ముద్రలు వేసేందుకు లబ్ధ్దిదారులు పరుగులు పెడుతున్నారు. ఈ నెల 31 వరకు రేషన్ లబ్ధిదారులంతా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు కోరుతున్నారు. వేలి ముద్రలు వేయని వారి విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ దుకాణాల నుంచి రేషన్ బియ్యం, ఇతర సరుకులు తీసుకునేందుకు ఈ-కేవైసీని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రేషన్ దుకాణాల్లో అప్డేట్ చేసిన ఈపాస్ మిషన్ల ద్వారా రేషన్ కార్డులో నమోదైన వారి వేలి ముద్రలు తీసుకుని, వారి వివరాలను నమోదు చేసే ప్రక్రియ కొంతకాలంగా జిల్లాలో కొనసాగుతున్నది. గత సెప్టెంబర్లోనే ఈ ప్రక్రియను మొదలు పెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 31కి గడువును పెంచింది. వేలిముద్రలు వేయకుంటే రేషన్ కార్డులో పేరుండదు అనే ప్రచారం నేపథ్యంలో ఇతర రాష్ర్టాల్లో ఉన్నవారు కూడా సొంతగ్రామాలకు వచ్చి ఈ-కేవైసీ చేయించుకుంటున్నారు.
దీంతో కార్డు దారులు రేషన్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఆరంభంలో ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే గడువు దగ్గర పడుతుండడంతో దుకాణాల వద్ద గత కొద్దిరోజులుగా రద్దీ మరింతగా పెరిగింది. పది సంవత్సరాలలోపు చిన్నారులు, వయసు పైబడ్డ వృద్ధులు ఈపాస్ యంత్రంలో వేలి ముద్రలు పడక ఇబ్బందులకు గురవుతున్నారు. మరికొందరు ఆధార్ అప్డేట్ కోసం ఆధార్ నమోదు కేంద్రాలకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగానే వేలి ముద్రలు తీసుకుంటున్నామని, రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 931 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 5,58,438 రేషన్ కార్డులు ఉండగా..అందులో 18,23,159 మంది సభ్యులుగా నమోదై ఉన్నారు. ఇప్పటివరకు ఈ-కేవైసీ ప్రక్రియను 11,64,050 మంది పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు 86 శాతం మంది వేలి ముద్రలు వేయగా.. ఇంకా 14 శాతం మంది వేలి ముద్రలు వేయాల్సి ఉంది. గడువు సమీపిస్తుండడంతో వంద శాతం పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.