కొడంగల్, మార్చి 22 : కొడంగల్ శ్రీమహాలక్ష్మీవేంకటేశ్వరుడి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అనుసరించే పూజా విధానాన్నే ఇక్కడ పాటించడం ఈ ఆలయం ప్రత్యేకత. అర్చకులు విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి వైఖానస ఆగమన పద్ధతినే పాటిస్తూ కైంకార్యాలను నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ ప్రధాన అర్చకుడిగా కొనసాగిన ఎన్ఏకే సుందరవరద భట్టాచార్యులు తిరుమల తిరుపతి దేవస్థానంలో వైఖానుసాగమ సలహాదారుడిగా గౌరవాన్ని పొందారు. ఆయన నేతృత్వంలో గత 40 ఏండ్లుగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతూ వచ్చాయి.
ప్రస్తుతం ఆయన పరమపదించడంతో వారి కుటుంబసభ్యులు స్వామివారికి నిత్యసేవలు, బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతిఏటా ఫాల్గుణమాసంలో తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు సాక్షాత్తు తిరుమల తిరుపతిలో ఆ తరుమలేశుడికి నిత్యపూజలు నిర్వహించే అర్చకుల నేతృత్వంలో జరుగడం ఇక్కడి ప్రధాన ప్రత్యేకత. వచ్చేనెల 2వ తేదీన స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
రెండో తేదీన తిరుమంజనం, మూడున సేనాధిపతి ఉత్సవం, నాలుగున ధ్వజారోహణం, ఐదోతేదీన చిన్న శేషవాహనం, ఆరోతేదీన సింహవాహనం, ఏడోతేదీన కల్పవృక్ష వాహనం, సర్వభూమపాల వాహనం, ఎనిమిదో తేదీన మోహినీ అవతారం, గరుడోత్సవం (లంకాదహనం) తొమ్మిదో తేదీన హనుమంత వాహనం, వసంతోత్సవం, పదోతేదీన సూర్యప్రభ వాహనం, 11న రథోత్సవం, 12 పల్లకి ఉత్సవం, చక్రస్నానం, ధ్వజారోహణం.