కొడంగల్ : నియోజకవర్గంలో మిషన్ భగీరథ పనులు పెండింగ్లు ఉండి తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఈఎన్సీ కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు నియోజకవర్గ మిషన్ భగీరథ పనులు, నీటి సరఫరాపై ఈఎన్సీ కృపాకర్కు వివరించారు. ప్రస్తుతం వరకు పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, ఎప్పుడో పూర్తి కావాల్సిన పనులు అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని కాలాల్లో తాగునీటి ఇబ్బందుల తలెత్తకుండా, బిందెలు పట్టుకొని దూర ప్రాంతాలకు వెళ్లె పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకుగాను ముఖ్యమంత్రి ఎంతో కృషి, దీక్షతో మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించి అందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకుగాను కోట్లాది నిధులను ఎప్పటికప్పుడు అందిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు జరగకపోవడం బాధకరమన్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు పనుల నిర్వాహణపై వివరించడం జరుగుతుందని, అయినా పూర్తిస్థాయిలో పనులు కొనసాగడం లేదన్నారు. ప్రస్తుతం వరకు పనులు పూర్తి చేస్తారని ఉపేక్షించడం జరుగుతుందని, ఇటువంటి పరిస్థితి నెలకొని ఉంటే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇంటింటికీ స్వచ్ఛమైన కృష్ణాజలాలను అందించేందుకు సీఎం ప్రత్యేకంగా కృషి చేస్తుంటే, క్రింది స్థాయి అధికారులు పనుల నిర్వాహణ, పర్యవేక్షణలో లోపంతో సఫలీకృతం కాలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా 100శాతం జరిగే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. పనుల నిర్వాహకు పూర్తిస్థాయిలో మెటిరియల్ అందించాలని, నెల రోజుల్లో మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి ప్రతి ఇంటికీ నీళ్లు పరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ఈలు, ఈఈలు, డీఈలు, ఏఈలతో పాటు 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు.