రంగారెడ్డి, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు మరోసారి కదం తొక్కారు. రైతుకు వెన్నుదన్నుగా నల్లగొండ వేదికగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభకు దండుగా తరలివెళ్లారు. ప్రజానీకం సైతం పెద్ద ఎత్తున తరలివెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై గళమెత్తింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్న ఈ సభకు జిల్లాకు చెందిన ఎంపీ రంజిత్రెడ్డి, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డితోపాటు తాజా, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు సైతం స్వచ్ఛందంగా తరలివెళ్లి పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. నల్లగొండ సభపై గత కొద్ది రోజులుగా సర్వత్రా చర్చ జరుగగా.. మంగళవారం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సభ ట్రెండ్ అయ్యింది.
అండగా నిలవడంపై సర్వత్రా హర్షం..
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ దండు, రైతాంగం సమరానికి సై అన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బతుకులను ఆగం చేసే చర్యలకు పూనుకుంటుండడం రైతుల్లోనూ ఆగ్రహం తెప్పిస్తున్నది. ఈ నేపథ్యంలోనే.. కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునివ్వగా.. ఈ సభకు అన్నివర్గాల ప్రజానీకం సైతం తండోపతండాలుగా తరలివెళ్లింది. రైతులకు అండగా నిలబడేందుకు కాలు ఫ్యాక్చర్ అయినప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రావడాన్ని అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి. కృష్ణా జలాలు జీవన్మరణ సమస్య అని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభలో రైతులకు వివరించారు. కృష్ణా జలాల కోసం కొట్లాడకుండా.. కేఆర్ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని, తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడతానని కేసీఆర్ సభ ద్వారా రైతులకు ధైర్యం చెప్పారు. ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ నిర్వహించిన తొలి సభ బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ కొత్త జోష్ను నింపింది.