ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కంటివెలుగు శిబిరాలు సందడిగా సాగుతున్నాయి. ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతుండడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. అవసరమైనవారికి కండ్లద్దాలు, మందులు పంపిణీ చేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే రంగారెడ్డి జిల్లాలో 14,118 మందికి కంటి పరీక్షలు చేయగా, వికారాబాద్ జిల్లాలో 4,745 మందికి టెస్ట్లు చేశారు. అదేవిధంగా రెండు జిల్లాల్లో కలిపి 1790 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేయగా.. మరో 1603 మంది కోసం ప్రిస్క్రిప్షన్ కండ్లద్దాలను ఆర్డర్ చేశారు.
షాబాద్, మార్చి 20 : రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా సాగుతున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సోమవా రం జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో 80 బృందాల ద్వారా 14,118 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. అందులో 1,130 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 958 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రంగారెడ్డి డీఎంహెచ్వో, వైద్యాధికారులు కృషి చేస్తున్నారు.
245 గ్రామాలు, 51 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట : సోమవారం జిల్లాలో 4745 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 660 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 705 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 245 గ్రామాలు, 51 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
కంటి వెలుగుతో మేలు : పైలయ్య, గొల్లగూడ, చేవెళ్ల మండలం
కంటి వెలుగుతో మాలాంటి పేదలకు ఎంతో మేలు జరుగుతున్నది. ప్రైవేట్ దవాఖానలకెళ్లి చూపించుకునే స్థోమత లేనివారికి వరంలా మారింది. మా గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరంలో పరీక్షించిన వైద్యులు నాకు ఉచితంగా అద్దాలు, మందులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నాకు దూరం చూపుతో కొంత ఇబ్బందిగా ఉండేది. దీంతో ఆ సమస్య తీరింది.