షాబాద్, ఏప్రిల్ 13 : రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా గురువారం 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 12,895 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 936 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. 853 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. కంటి వెలుగును విజయవంతం చేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
321 గ్రామాలు, 63 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లాలో నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చినవారికి జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. గురువారం జిల్లాలో 4940 మందికి కంటి పరీక్షలు చేయగా.. వీరిలో 612 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేశారు. 825 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో 321 గ్రామాలు, 63 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
మంచి కార్యక్రమం : కె.యాదమ్మ, ఇబ్రహీంపల్లి, చేవెళ్ల మండలం
గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూశాం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆసరాగా నిలుస్తున్నది. కంటి వెలుగు ఒక మంచి కార్యక్రమం. ఊర్లలోనే పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు, మందులు ఇవ్వడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్కు యావత్ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారు.