తాండూరు కంది కాసులు కురిపిస్తున్నది. నియోజకవర్గంలో ఈసారి అత్యధికంగా కంది సాగైంది. ‘తాండూరు బ్రాండ్గా ఆర్గానిక్ కంది పప్పు’నకు దేశంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ డిమాండ్ ఉన్నది. క్వింటాల్ కందులకు రూ.8,500, పప్పు క్వింటాల్కు రూ.1,200 ధర పలుకుతున్నది. ఇక్కడి నేలలో అట్ట్టాపుల్గేట్ (సుద్దకలిగిన మట్టి), అనుకూల వాతావరణం వల్ల నాణ్యతలో మేటిగా.. రుచిలో అద్భుతంగా కంది పప్పు ఉన్నదని పేరొచ్చింది. పప్పు ప్రత్యేకతను తెలుసుకునేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల కృషితో 2022 డిసెంబర్ 14న భౌగోళిక గుర్తింపు లభించింది. ఇటీవల తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో శాస్త్రవేత్తలకు జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ సర్టిఫికెట్ను రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్రెడ్డి అందజేశారు. ‘తాండూరు బ్రాండ్గా ఆర్గానిక్ కంది పప్పు’నకు జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ లోగో పెట్టినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
– తాండూరు, ఫిబ్రవరి 25
తాండూరు, ఫిబ్రవరి 25 : తాండూరు కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు లభించింది. నాణ్యతా పరంగా ఈ కందికి విశిష్ట లక్షణాలు కలిగి ఉండడంతో.. రుచి, సువాసనతో పాటు పోషకాల్లో దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. తాండూరు నేల స్వభా వం, నేలలోని పోషకాలు, అనుకూల వాతావరణ పరిస్థితులు, రైతులు ఆచరించే సంప్రదాయ, ఆధునిక యాజమాన్య పద్ధతులతో ప్రత్యేక గుర్తింపు లభించింది. తాండూరు కందిపప్పు అంటేనే నాణ్యతలో మేటి, రుచిలో అద్భుతం. దీంతో దేశంలో తాండూరు కందిపప్పుకు ఎంతో డిమాండ్ ఉన్నది. వికారాబాద్ జిల్లా తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో పండించిన కందులతో తయారు చేసిన కందిపప్పు రుచికి, నాణ్యతకు, పోషకాలకు ప్రఖ్యాతి. ఈ కందిపప్పు త్వరగా ఉడికే గుణంతో పాటు ఎక్కువ సమయం నిలువ ఉండే లక్షణం కలిగి ఉన్నది. ఇక్కడి నేలలో అట్ట్టాపుల్గేట్ (సుద్ధకలిగిన మట్టి), అనుకూల వాతావరణంతోనే అది సాధ్యమైంది.
భౌగోళిక గుర్తింపుతో మరింత డిమాండ్
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అత్యధిక ఎకరాల్లో కంది పంటను రైతులు సాగు చేస్తున్నారు. జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ భౌగోళిక గుర్తింపుతో అంతర్జాతీయ మార్కెట్లో తాండూరు కందిపప్పునకు మరింత డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది కందుల ధరలు పెరిగాయి. క్వింటాల్ కందులు మార్కెట్లో రూ.8,500 ధర పలుకుతున్నది. కంది పప్పు క్వింటాల్ రూ.1,200 ధర పలుకుతున్నది. తాండూరు కంది పప్పుకు మున్ముందు మరింత రేటు పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. కందిపప్పునకు జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ రావడంతో కంది పండించే రైతులకు మంచి రోజులు వచ్చాయని స్థానిక కర్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాండూరు ప్రాంత రైతులు అభివృద్ధి చెందడానికి పుష్కల అవకాశాలు లభించాయని శాస్త్రవేత్తలతో పాటు వ్యాపారులు వెల్లడించారు. తాండూరు ప్రాంతం లో పండించిన కందులతో తయారు చేసిన కందిపప్పుకు జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ లోగోను పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో పండించిన కందుల ద్వారా కందిపప్పు తయారు చేసి భౌగోళిక గుర్తింపు లోగో పెడితే చట్టపరమైన కేసులు తప్పవని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి ‘తాండూరు బ్రాండ్గా ఆర్గానిక్ కంది పప్పు’ను తయారు చేసి అమ్మకాలు జరుపుతున్న పప్పునకు జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ లోగో పెట్టినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
రైతులకు గిట్టుబాటు అయ్యేలా..
తెలంగాణలోని జిల్లాలే కాకుండా భారత దేశంలోని వివిధ రాష్ర్టాలతో పాటు విదేశాలకు సైతం తాండూరు కందిపప్పు ఎగుమతి అవుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ కందిపప్పునకు మంచి డిమాండ్, నాణ్యత ఉండడంతో ఈ పంట పండించే రైతులకు మరింత గిట్టుబాటు అయ్యేలా చేసేందుకు తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సుధాకర్ ఐదేండ్లు ఎంతో శ్రమించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు, పరిశీలనలు చేశారు. తాండూరు ప్రాంతంలో కంది సాగు ఆధారాలు, చరిత్రతో పాటు దాని ప్రాముఖ్యతను జీఐ శాఖకు వివరించారు. దీంతో 2022 డిసెంబర్ 14న తాండూరు కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు (జియోలాజికల్ ఐడెంటిఫికేషన్) లభించింది. ఈ ఏడాది జనవరి 31న రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్రెడ్డి తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో శాస్త్రవేత్తలకు జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ సర్టిఫికెట్ను అందజేశారు.
తాండూరు కంది పప్పు ప్రత్యేకత
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో కంది పంట సాగు అత్యధిక విస్తీర్ణంలో సావుతున్నది. ప్రపంచ మార్కెట్లో తాండూరు కందిపప్పు అంటే చాలు ప్రజలు అట్టే కొనేస్తారు. మంచి రుచితో పాటు నాణ్యత ఉండడంతో తాండూరులో తయారైన కందిపప్పుకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం కోసం తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి ‘తాండూరు బ్రాండ్గా ఆర్గానిక్ కంది పప్పు’ను తయారు చేసి అమ్మకాలు జరిపేందుకు గతేడాది నుంచి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నిర్ణయం తీసుకున్నది. అందుకు తగ్గట్లు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కంది పప్పు తయారీ మిషన్ను తీసుకొచ్చారు.
రసాయనిక ఎరువులు, మందులు వాడకుండా పండించిన పంటతో వందకు 100 శాతం నాణ్యమైన కందిపప్పును మార్కెటింగ్ చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకున్నారు. నేరుగా బయట మార్కెట్లో అమ్మకాలు జరిపేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ స్టాండెడ్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి తాండూరు కందిపప్పునకు లైసెన్స్ కూడా లభించింది. 2020 జూన్ 2న సీఎం కేసీఆర్ తాండూరులో పండించిన ఆర్గానిక్ కంది పుప్పు విక్రయాలను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేశారు. దీంతో తాండూరు కందిపప్పు పేరుతో జిల్లా కేంద్రాలతో పాటు ప్రధాన నగరాల్లో తాండూరు కందిపప్పు బస్తాలు లభిస్తున్నాయి. ఆర్గానిక్ కందిపప్పుకు కిలో రూ.170 ధర నిర్ణయించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
జీఐ గుర్తింపుతో రైతులకు మేలు
దేశంలో విశేష గుర్తింపు పొందిన ఉత్పత్తులు, వస్తువులకు మాత్రమే జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ లభిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితో తాండూరు కందిపప్పునకు జీఐ గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. దీంతో ఇతరులు తాండూరు కందిపప్పు పేరుతో వ్యాపారం చేసే అవకాశం ఉండదు. ఈ ప్రాంతం రైతులు అనుకున్న విధంగా మంచి లాభాలు వస్తాయి. భారత పరిశ్రమల సమాఖ్య, వ్యవసాయ పరిశోధన స్థానం కలిసి తాండూరు కందిపప్పునకు భౌగోళిక సూచిక సాధించడానికి సహకారం అందించాయి. తాండూరు బ్రాండ్గా ఆర్గానిక్ కంది పప్పును తయారు చేసి మార్కెట్లో అమ్మేందుకు ఉంచారు. ఊహించిన దానికంటే ఎక్కువగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.
– సుధాకర్, ప్రధాన శాస్త్రవేత్త, తాండూరు వ్యవసాయ కేంద్రం