కడ్తాల్ : సేవలతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, యువత సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో వివేకానంద యువజన సంఘం, యువజన సంఘాల ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో అన్మాస్పల్లి చౌరస్తాలో నిర్మించిన బస్సు షెల్టర్ ప్రారంభోత్సవముతో పాటు, తెలంగాణ ఉద్యమకారులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్, స్వామి వివేకానంద విగ్రహాలకు వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎరోళ్ల రాఘవేందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ సేవకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలిపారు. ఎంతోమంది త్యాగాలు, ఉద్యమాలు, పోరాటాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ ఉద్యమకారులకు ఎల్లప్పుడు అండగా ఉంటానని పేర్కొన్నారు. ఉద్యమకారులకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తానని చెప్పారు. అందరం సమన్వయంతో ముందుకెళ్లి మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఆచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారని, వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇవ్వాలని పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన రాష్ట్రాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారులకు శాలువ, మెమొంటోలను అందజేసి ఘనంగా సన్మానించారు. మండలంలో సేవా కార్యక్రమాలను చేపడుతున్న ఎరోళ్ల రాఘవేందర్ను ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు చందోజీ, యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు రాఘవేందర్, మాధవులు, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.